హైదరాబాద్ కు ఇస్తాంబుల్ స్ఫూర్తి: కేసీఆర్
టర్కీ పట్టణం ఇస్తాంబుల్ స్ఫూర్తితో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా మారస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్:టర్కీ పట్టణం ఇస్తాంబుల్ స్ఫూర్తితో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా మారస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. చారిత్రక ఆనవాళ్లు చెదిరిపోకుండా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. నగరంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై ఆర్కిటెక్ హఫీజ్ బృందంతో కలిసి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా మూసీనది చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చేపట్టాల్సిన నిర్మాణాలపై ఆయన చర్చించారు. ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ కళాభారతి పేరుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రవీంద్రభారతి స్థానంలో మరో ప్రత్యేక కట్టడంతో పాటు, మూసీ నదికి రెండు వైపులా పార్క్ లు నిర్మిస్తామన్నారు. ఆనాటి నిజాం కాలంలో హైదరబాద్ లో అద్భుతమైన కట్టడాలు వచ్చాయన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా చేశారని.. హైటెక్ సిటీ పేరుతో నిర్మించిన ఓ సిమెంట్ కట్టడాన్ని హైదరాబాద్ సింబల్ గా గత పాలకులు చూపించారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ తట్టుకునేందుకు మల్టీ లేయర్ ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దడానికి టర్కీ పట్టణం ఇస్తాంబుల్ స్ఫూర్తి అని ఆయన అన్నారు. కొత్తగా నిర్మించే టవర్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి వృద్ధి చెందుతుందన్నారు.


