కాన్వాయ్ అడ్డుకుని.. ఎంపీని చితకబాదారు!

బీజేపీ ఎంపీని చితకబాదారు! - Sakshi

కోల్ కతా: అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యకర్తలు ఏకంగా ఓ బీజేపీ ఏంపీని టార్గెట్ చేసి చితకబాదారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని కల్నాలో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలివి.. బీజేపీ ఎంపీ జార్జ్ బేకర్ తన టయోటా వాహనంలో పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఆయన కాన్వాయ్ బుద్వాన్‌ లో సమావేశ ప్రాంగణానికి వెళుతుండగా అధికార టీఎంసీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ జార్ట్ బేకర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.

 

మొదట ఎంపీ కాన్వాయ్ పై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎందుకు దాడి చేస్తున్నారో తెలుసుకునేలోగా బీజేపీ ఎంపీపై దాడికి పాల్పడి ఆయనను చితకబాదారు. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేయడంతో టీఎంపీ కార్యకర్తలు అక్కడినుంచి పరారయ్యారు. ఎంపీ బేకర్ ను ప్రాథమిక చికిత్స నిమిత్తం కల్నాలోని సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాధిత ఎంపీ తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ పార్టీ నేతపై దాడి జరగలేదని రాష్ట్ర బీజేపీ చెప్పడం గమనార్హం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top