మరో కొత్త కథతో వస్తున్నా: పార్థిబన్‌ | Sakshi
Sakshi News home page

మరో కొత్త కథతో వస్తున్నా: పార్థిబన్‌

Published Thu, Nov 2 2023 10:27 AM

actor parthiban Upcoming Movie Latest Update - Sakshi

 విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్‌ పార్థిబన్‌. నటుడిగా, కథకుడిగా, దర్శక, నిర్మాతగా ఈయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో పార్థిబన్‌ దిట్ట. ఆ మధ్య ఏకపాత్రాభినయం చేసి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఒత్త చెరుప్పు సైజ్‌ సెవెన్‌ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆధరణ పొందింది. అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఆ తరువాత పార్థిబన్‌ రూపొందించిన చిత్రం ఇరవిన్‌ నిళల్‌.

ఇది నాన్‌ లీనియర్‌ ఫార్మెట్లో సింగిల్‌ షాట్‌లో తెరకెక్కించిన ప్రయోగాత్మక కథా చిత్రం. ఈ చిత్రం ప్రశంసలను అందుకుంది. తాజాగా మరో కొత్త కథతో వస్తున్నానని ట్విట్టర్‌(ఎక్స్‌)లో పేర్కొన్నారు. ఈసారి నాన్‌ లీనియర్‌ ఫార్మెట్‌ కాదని, ప్రయోగాత్మకంగా కథా చిత్రం అస్సలు కాదని, అలాగని సాధారణ కథా చిత్రం కాదని చెప్పారు. ఇంతకు ముందు చిత్రాల్లో చేసిన తప్పులను సరి చేసుకుంటూ ఈ చిత్రాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రూపొందిస్తున్నట్లు తెలిపారు.

చిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చాలా ఉంటుందని, గ్రాఫిక్స్‌ అంటే హాలీవుడ్‌ చిత్రాలే గుర్తుకొస్తాయని అన్నారు. మనకు బడ్జెట్‌ సమస్య తలెత్తుతుందని అన్నారు. అయితే చాలాకాలం క్రితమే తమిళంలో చంద్రలేఖ, ఆయిరత్తిల్‌ ఒరువన్‌, ఉలగం చుట్రం వాలిబన్‌ వంటి బ్రహ్మాండ చిత్రాలు వచ్చాయని పేర్కొన్నారు.

అలా మంచి కథతో తాను రూపొందిస్తున్న కథా చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసి డబ్బింగ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లు పార్థిబన్‌ అన్నారు. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement