చంద్రబాబు వంచక పాలనపై నేడే ఉద్యమ శంఖం

చంద్రబాబు వంచక పాలనపై నేడే ఉద్యమ శంఖం - Sakshi


మూడు దశల్లో నిర్వహిస్తాం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి



సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం నుంచి మూడు నెలల పాటు మూడు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్లలో కోత, హుద్‌హుద్ తుపాను బాధితుల సమస్యలే ఎజెండాగా ఈ ఆందోళనలు సాగుతాయని తెలి పారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. వచ్చే నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తామని చెప్పారు.



జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు స్వయంగా తానే గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజలందరూ ఆందోళనలను జయప్రదం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.



చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని రైతులకు ఇప్పుడు అపరాధ వడ్డీ రూపేణా 28 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిం దని, డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొ మ్ము నుంచి వడ్డీ చెల్లించుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలప్పుడు పింఛనుదారులందరికీ వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు.



బాబు వల్లే రైతులకు పంటల బీమా రాలేదు

‘‘హుద్‌హుద్ తుపానులో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారమే 3.03 లక్షల హెక్టార్లలో పంటకు పూర్తిగా నష్టం జరిగింది. మరో 3.09 లక్షల హెక్టార్లలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగింది. చంద్రబాబు రుణ మాఫీ హామీని నిల బెట్టుకోని కారణంగా ఈ రైతులందరికీ పంటల బీమా కూడా రాని దారుణమైన పరిస్థితి ఏర్పడింది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘‘ఎన్నికలకు ముందు తనకు అన్నీ పూర్తిగా తెలుసం టూ చంద్రబాబు హామీలు ఇచ్చుకుంటూ పో యారు.



రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనే 87,612 కోట్ల వ్యవసాయ రుణా లు, 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉన్నాయని లెక్కలు తేల్చారు. రెండు రకాల రుణాలు కలిపితే 1.01 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. చంద్రబాబు చెల్లించవద్దన్నందుకు రుణాలు కట్టని కారణంగా ఆయన పుణ్యామా అని వారందరిపై పోయిన ఏడాదికే 14 వేల కోట్ల రూపాయలు అపరాధ వడ్డీగా భారం పడింది. రుణ మాఫీకి ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించని కారణంగా ఈ సంవత్సరానికి మరో 14 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది.



రెండేళ్లకు కలిపి రుణాలపై వడ్డీనే 28 వేల కోట్లు రూపాయలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు మాత్రం రుణమాఫీకి ఐదు వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అసలు సంగతి దేవుడికి ఎరుక. వడ్డీనే 28 వేల కోట్లు ఉన్నప్పుడు 5 వేల కోట్లతో 20 శాతం రుణ మాఫీ చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్న మాటలనుబట్టే చంద్రబాబు ఎంతగా రైతులను మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది.



చంద్రబాబు రుణాలు మాఫీ చేయని కారణంగా ఈ ఏడాది రైతుల రుణాలు తిరిగి రెన్యువల్ కాలేదు. పంటలకు బీమా రావడంలేదు. డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బు నుంచి బ్యాంకు వడ్డీని జమ చేసుకుంటున్నాయి’’ అని వివరించారు. ఈ సందర్భంగా బాబు అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశానికి సంబంధించిన పుస్తకాన్ని జగన్ విలేకరులకు చూపించారు.



ఇంకెన్ని పింఛన్లకు కోత పెడతారో?

‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం లో 43,11,686 వరకు పింఛన్లు ఉన్నాయి. వాటి లో దాదాపు 10 లక్షల పింఛన్లకు ఇప్పటికే కోత పెట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ వెయ్యి రూపాయల పింఛను చెల్లిస్తే ఏడాదికి దాదాపు 3,650 కోట్ల రూపాయ లు అవసరమవుతాయి. అయితే, బడ్జెట్‌లో మా త్రం 1,338 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. పింఛన్లకు కోతపెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు బడ్జెట్‌లో అవసరమైనదాని కంటే తక్కువ నిధులు కేటాయించారు.



పింఛన్ల ఖర్చు రూ. 1,338 కోట్లకు పరిమితం చేసేలా మరికొన్ని పింఛన్లకు ప్రభుత్వం కోతపెట్టే అవకాశం ఉంది’’ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై విలేకరులు ప్రశ్నించగా.. దీనిపై వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం కూడా అందజేశారని జగన్ వివరించారు.

 

మున్సిపల్ సమావేశాల్లో హత్యలా?

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతోంది. మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఒకరిపై ఒకరు గొడవ పడినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై పడిన గొడవకే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రౌడీషీటు తెరవడమే రాష్ట్రంలో ఆటవిక పాలనకు నిదర్శనం’’ అని జగన్ విరచుకుపడ్డారు. ‘‘మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొడవ పడతారే గానీ.. ఎవరైనా, ఎక్కడైనా ఆ సమావేశాల్లో హత్యలు చేస్తారా? హత్య చేయడానికి పూనుకుంటారా’’ అని ప్రశ్నించారు.



‘‘ఎవరిపైనయినా రౌడీషీట్ తెరవాలంటే అతనిపై కనీసం మూడు కేసులు ఉండాలని చట్టం చెబుతోంది. భూమా నాగిరెడ్డిపై ఇంతకుముందు ఒక్క కేసు కూడా లేదు. మున్సిపల్ సమావేశంలో సంఘటన ఆధారంగానే ఆయనపై టపటపా మూడు కేసులు కట్టేసి రౌడీషీటు తెరిచే పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబూ ఒక మనిషేనా అన్నది ఆయన గుండెల మీదే చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలి. చివరకు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేని కౌన్సిలర్లపైనా ఒక్క సంఘటన ఆధారంగానే మూడు కేసులు కట్టి వారిపై రౌడీషీట్లు తెరిచారు’’ అని ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై భూమా నాగిరెడ్డి కుమార్తె, ఎమ్మెల్యే అఖిల బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడతారని తెలిపారు.

 

ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించమంటే బాబు వినలేదు

‘‘ప్రభుత్వ, అటవీ భూములున్న చోటే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  చేసిన సూచనను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు పెద్ద సమస్యలు వస్తున్నాయి. రాజధాని విషయంలోబాబుకు అసెంబ్లీలోనే మా వైఖరి స్పష్టంగా చెప్పాం. ఎక్కడైనా 30 వేల ఎకరాల ప్రభు త్వ భూమి ఉన్న చోట రాజధాని నిర్మించాలని సూచించాం. పునర్విభజన చట్టంలో అటవీ భూములు ఢీనోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చినందున, అవి ఉన్న చోటైనా నిర్మించమని చెప్పాం.



ప్రభుత్వ భూములున్న చోట రాజధాని నిర్మిస్తే సామాన్యులు, ఉద్యోగులు కూడా అక్కడ సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలు కొనుక్కొనే అవకాశముంటుందని కూడా చెప్పాం. ఇవేమీ చంద్రబాబు చెవికి ఎక్కించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అని మొదలుపెట్టింది. చివరకు ల్యాండ్ పూలింగ్ కాస్తా ల్యాండ్ ఫూలింగ్ (రైతులను ఫూల్స్ చేసేలా) చేసే కార్యక్రమంగా తయారైంది. అందుకే రైతులు గట్టిగా నిరసన తెలుపుతున్నారు. రైతులకు అన్యాయం జరిగే ఏ పరిస్థితినైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’’ అని చెప్పారు.

 

బాబుకు చిత్తశుద్ధే ఉంటే శ్రీశైలం సమస్య వచ్చేదే కాదు

రాయలసీమ నీటి అవసరాలపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటి సమస్య ఇంత దూరం వచ్చేదే కాదని జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉన్నప్పుడు చంద్రబాబు రాయలసీమ నీటి అవసరాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ప్రాజెక్టుకు ఎడమ వైపు కేసీఆర్ ప్రభుత్వం, కుడి వైపు నుంచి బాబు ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఎడాపెడా తోడేసి విద్యుత్ కోసం వాడటంతో 15 రోజుల్లోనే ప్రాజెక్టులో నీరు 858 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో రాయలసీమకు నీరందుతుంది. నీటి మట్టం 858 అడుగులకు చేరాక బాబుకు సీమ అవసరాలు గుర్తుకు వచ్చాయి.



అప్పుడు ఏపీ ప్రభుత్వం తమ వైపు విద్యుత్ ఉత్పతిని నిలిపివేసి కేసీఆర్‌ను తిట్టడం మొదలుపెట్టారు’’ అని అన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటన్నది తాను ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పానని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గించారని, దానిని తిరిగి 854 అడుగులకు సవరిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి 107 జీవో తీసుకొచ్చారని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

 

తెలంగాణ విద్యుత్ సమస్య తీర్చవచ్చిలా..

‘‘తెలంగాణకు విద్యుత్ కొరత ఉన్న మాట నిజమే. అయితే కేసీఆర్ కొంత మానవత్వంతో, వినూత్నంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య సరఫరా లైన్లు లేవు. లైన్ల నిర్మాణానికి రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ అందదు. తెలంగాణలో ఎన్టీపీసీ ఆధర్యంలోని 2,600 మెగావాట్ల రామగుండం విద్యుత్ ప్రాజెక్టు ఉంది. అందులో ఎన్టీపీసీకి వాటాగా దక్కే 75 శాతం విద్యుత్‌ను ఆ సంస్థ ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుంది.



కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో కొనే వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను అక్కడ ఎన్టీపీసీకి అప్పగించి, రామగుండం ప్లాంట్‌లో ఎన్టీపీసీ వాటా నుంచి తెలంగాణకు విద్యుత్‌ను తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలా చేస్తే విద్యుత్ లైన్లు వేసేవరకు ఆగాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు 1,000 మెగావాట్ల సామర్థ్యం గల విశాఖపట్నం సింహాద్రి ప్లాంట్ ఫేజ్-2లో  60 శాతం విద్యుత్ ఎన్టీపీసీ వాటాగా ఉంది. తెలంగాణ ఇక్కడి నుంచి ఎన్టీపీసీ నుంచి విద్యుత్ తీసుకోవచ్చు. దీనికి బదులుగా ఛత్తీస్‌గఢ్‌లో కొనుగోలు చేసే విద్యుత్‌ను ఆ సంస్థకు ఇవ్వవచ్చు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ కొంత చొరవ చూపితే ఈ సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని’’జగన్ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top