టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌తో రూ.1,407 కోట్లు | Sakshi
Sakshi News home page

టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌తో రూ.1,407 కోట్లు

Published Thu, Jun 29 2017 10:58 AM

టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌తో రూ.1,407 కోట్లు

ఇండోర్‌ : రిజర్వ్‌ చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్‌తో భారత రైల్వే భారీగా ఆదాయాలు ఆర్జించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్ల క్యాన్సిలేషన్‌ ద్వారా రూ.1,407 కోట్ల ఆదాయాలు ఆర్జించినట్టు రైల్వే పేర్కొంది. గతేడాది కంటే ఇది 25.29 శాతం అధికమని తెలిపింది. ఆర్‌టీఐ కింద కార్యకర్త చంద్రశేఖర్‌ గౌడ్‌ కోరిన సమాచారం మేరకు సెంట్రల్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌(సీఆర్‌ఐఎస్‌) ఈ వివరాలను వెల్లడించింది. గౌడ్‌కు ఇచ్చిన సమాధానంలో.... 2016-17 ఆర్థికసంవత్సరంలో టిక్కెట్‌ క్యాన్సిలేషన​ ద్వారా రూ.14.07 బిలియన్ల ఆదాయాలను పొందామని సీఆర్‌ఐఎస్‌ పేర్కొంది. అంతేకాక 2015-16లో ఇవి రూ.11.23 బిలియన్లుగా ఉన్నట్టు కూడా తెలిపింది. ఈ సమాచారమంతా ప్యాసెంజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ కింద తనకు అందించిందని గౌడ్‌ పీటీఐకి చెప్పారు.
 
కేవలం రిజర్వు చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్‌ ద్వారా మాత్రమే కాక, రిజర్వు కాని టిక్కెట్ల క్యాన్సిలేషన్‌తో కూడా రైల్వే ఆదాయాలను ఆర్జిస్తుంది. అన్‌రిజర్వుడ్‌ టిక్కెటింగ్‌ సిస్టమ్‌(యూటీఎస్‌) ద్వారా 2016-17లో రూ.17.87 కోట్లను పొందినట్టు ఆర్టీఐ సమాధానంలో తెలిపింది. ఈ మొత్తం 2015-16లో రూ.17.23 కోట్లు, 2014-15లో రూ.14.72 కోట్లు ఉంది.  రైల్వే ప్యాసెంజర్‌ నిబంధనలు 2015 కింద అదే ఏడాది నవంబర్‌లో క్యాన్సిలేషన్‌ టిక్కెట్ల మొత్తాన్ని రీఫండ్‌ చేసే నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. క్యాన్సిలేషన్‌ ఫీజులను రెండు సార్లు పెంచారు.  ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే, రీఫండ్‌ రూల్స్‌ను మార్చాలని గౌడ్‌ పేర్కొన్నారు.  

Advertisement
Advertisement