సత్య మనోడే


యల్లనూరు, న్యూస్‌లైన్/సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్‌గేట్స్ తీసుకున్న నిర్ణయంతో ‘అనంత’ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది. ఆ సంస్థ నూతన సీఈఓగా నాదెళ్ల సత్యనారాయణ చౌదరి అలియాస్ సత్య ఎంపికపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 యల్లనూరు మండలం బుక్కాపురం ఆయన స్వస్థలం. ఆయన తండ్రి బీఎన్ యుగంధర్ రిటైర్టు ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ నాయుడు ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు.

 

 సత్య స్కూలు విద్య హైదరాబాద్‌లో అభ్యసిస్తుండగా ఒకసారి మాత్రమే గ్రామానికి వచ్చినట్లు సమీప బంధువులు చెప్పారు. యుగంధర్ మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారు. ఏడాది క్రితం కూడా గ్రామానికి వచ్చారు. తాడిపత్రిలోని అరవింద్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాగా, సత్య అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించడంపై గ్రామ సర్పంచ్, వారి బంధువు శంకరయ్య హర్షం వ్యక్తం చేశారు. సత్య ఎంపిక పట్ల అనంతపురం జిల్లాకు భవిష్యత్‌లో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top