-
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
కృత్రిమ మేధ కబ్జాపర్వం!
దొడ్డ శ్రీనివాస రెడ్డి : కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా మన జీవితాల్ని కబ్జా చేస్తోంది. కంప్యూటర్ నిపుణుడు క్రిస్టఫర్ స్ట్రాచె 1951లో మాంచెస్టర్ యూనివర్సిటీలో కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రాంతో మొదలైన ఏఐ శకం నేడు అన్ని రంగాల్లోకి శరవేగంగా చొరబడుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలకు కోతపెడుతూ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ‘కృత్రిమ మేధ మనిషి మేదస్సును చేరుకోవడానికి ఇంకా అనేక పరిశోధనలు, లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఈ లక్ష్యసాధనకు ఎంత సమయం పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం’అని అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన ఏఐ నిపుణుడు స్టువర్ట్ రసెల్ నాలుగేళ్ల క్రితం అన్న మాటలివి. అయితే మనిషి మేదస్సును అందుకోవడంలో కృత్రిమ మేధకు ఇంకా ఎక్కువ సమయం పట్టకపోవచ్చనిపిస్తోంది. కోడ్ రాస్తుంది... చాట్జీపీటీ ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ ప్రోగ్రాం కోడ్ రాయగలుగుతుంది. అయితే కృత్రిమ మేధపై పెరుగుతున్న పరిశోధనలను పరిశీలిస్తే ఈ ఏడాదిలోనే సంక్లిష్టమైన కోడింగ్లను రాయగల సత్తా ఏఐ సమకూర్చుకోగలుగుతుందని అర్థమవుతోంది. మనిషి రూపొందించిన సాఫ్ట్వేర్ను పరీక్షించడానికి రెండేళ్ల క్రితమే ఏఐ ఆధారిత ‘టురింగ్ బోట్స్’అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు టురింగ్ బోట్స్ స్వయంగా సాఫ్ట్వేర్లను రూపొందించే దిశగా అవతరిస్తున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫోరెస్టర్ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్లలో 10 శాతానికిపైగా టురింగ్ బోట్స్ కోడ్లను, టెస్ట్లను రాయగలుగుతాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలను ఇవి ఆక్రమించబోతున్నాయని, ఆ ఉద్యోగులు ఇక పర్యవేక్షణ, నిర్వహణ ఉద్యోగులుగా మారబోతున్నారనేది ఫోరెస్టర్ అభిప్రాయం. వచ్చే ఏడాదికల్లా చాలావరకు వ్యాపార సంస్థలు కోడింగ్కు సంబంధించి 30 శాతం వరకు కృత్రిమ మేధపై ఆధారపడబోతున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఒక నిర్ధారణకు వ చ్చింది. ఈ ఏడాది ఫార్చూన్–500 కంపెనీల ద్వారా వెళ్లే అన్ని రకాల సమాచారాల్లో 10 శాతానికిపైగా ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లే సృష్టించబోతున్నాయని ఫోరెస్టర్ చెబుతోంది. అదే 2025 నాటికి అన్ని వ్యాపార సంస్థల నుండి వెలువడే సమాచారంలో 30 శాతానికిపైగా కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్లే సృష్టించబోతున్నాయని వ్యాపార పరిశోధనా సంస్థ గార్ట్నర్ అంచనా. అలాగే 2026 నాటికి వ్యాపార సంస్థల మధ్య లావాదేవీల్లో సగానికి పైగా ఏఐ ద్వారానే సాగబోతున్నాయని, 2030 నాటికి మొత్తంగా కృత్రిమ మేధ ఆధారంగా ఐదో వంతు వ్యాపార లావాదేవీలు సాగుబోతున్నాయని కూడా గార్ట్నర్ అభిప్రాయం. 2026 నాటికి 75 శాతం బడా కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, సామర్థ్యం, సప్లయ్ చెయిన్, అభివృద్ధి కార్యక్రమాలను కృత్రిమ మేధే నిర్వహించబోతోందని డేటా కార్పొరేషన్ ఐడీసీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1.7 కోట్ల మంది కాంటాక్ట్ సెంటర్ ఏజెంట్లు పనిచేస్తుండగా 2026 నాటికి వాళ్ల మధ్య జరిగే లావాదేవీల్లో 10 శాతం ఏఐ ద్వారా ఆటోమేట్ కాబోతున్నాయని గార్ట్నర్ చెబుతోంది. దీనివల్ల మొత్తంగా 8,000 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని కూడాఈ సంస్థ వెల్లడించింది. మనిషి అవసరం లేదు.. మనిషి రోజువారీ పనులన్నింటినీ అతిత్వరలో కృత్రిమ మేధ హస్తగతం చేసుకోబోతోందని ఏఐ నిపుణుడు కామ్ ఫులీ హెచ్చరిస్తున్నారు. ఆదాయం, చదువు విషయంలో సమాజంలో చివరన ఉన్న అత్యధిక జనాభాను ఏఐ తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని ఆయన అంటున్నారు. ‘ఒకçప్పుడు కంపెనీలు ఆదాయం కోసం ఉద్యోగుల సంఖ్యను 5–10 శాతం తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేసేవి, కానీ ఇప్పుడు అందుబాటులోకి వ చ్చిన ఏఐతో ఒక శాతం ఉద్యోగులతో మొత్తం పని ఎలా చేయించవచ్చో ఆలోచిస్తున్నాయి’అని ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహన్ జోషి ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆధారిత చాట్జీపీటీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపబోతోందని దాని స్థాపిత సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ హెచ్చరిస్తున్నారు. మనిషి మాదిరి అనేక లక్ష్యాలను పూర్తిచేయగల ఏఐ చాట్బోట్ వల్ల మనుషులు నిర్వహించే అనేక ఉద్యోగాలకు ఎసరుపెట్టబోతోందని, అయితే మనిషికున్న సృజనాత్మకశక్తి కారణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆల్డ్మన్ అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సమాచారం అందించే రెస్యూమ్బిల్డర్.కామ్ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాకు చెందిన వెయ్యి కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగుల స్థానంలో ఇప్పటికే చాట్జీపీటీ లేదా ఇతర చాట్బోట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. మరో సర్వేలో 44 శాతం కంపెనీలు కృత్రిమ మేధను తమ కంపెనీ వ్యవహారాల్లో ఉపయోగించుకొనేందుకు వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. గతేడాది ఐబీఎం సంస్థ సంపాదించుకున్న మొత్తం 9,130 పేటెంట్లలో 2,300 కృత్రిమ మేధతో సంబంధం ఉన్నవే కావడం రానున్న కాలంలో ఏఐ విస్తృతిని చెప్పకనే చెబుతోంది. నియంత్రణ ఎలా? ఇందుకలడందుగలడు అన్నట్లుగా అన్ని రంగాల్లోకి, అన్ని విభాగాల్లోకి చోచ్చుకుపోతున్న కృత్రిమ మేధ నియంత్రణ సాధ్యమా? దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన పద్ధతులేమిటన్నది ఇప్పుడు కంపెనీ అధిపతుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు వేధిస్తున్న ప్రశ్న. కృత్రిమ మేధ నిర్వహించే కార్యకలాపాలను, తప్పొప్పులను న్యాయపరంగా ఎలా ఎదురుకోవాలి, సైబర్ సెక్యూరిటీని ఎలా సాధించాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే ఏఐ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రతి కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) లేదా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)ను నియమించుకుంటోంది. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ద్వారా జరిగే కార్యకలాపాల నియంత్రణ అన్నది ప్రతి వ్యాపార సంస్థకు పెద్ద బాధ్యత కాబోతోందని ఫోరెస్టర్ చెబుతోంది. ఇటీవల జరిగిన డేటా రోబో సర్వేలో ఏఐపై ప్రభుత్వ నియంత్రణలకు 81 శాతం మంది టెక్ కంపెనీల అధిపతులు సానుకూలంగా స్పందించారు. కృత్రిమ మేధ విస్తరిస్తున్న వేళ ప్రజల సంరక్షణార్థం అమెరికా ఇటీవల ఏఐ బిల్ ఆఫ్ రైట్స్ పేరిట ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది. సైబర్ సెక్యూరిటీ కోసం కంపెనీలు పాటిస్తున్న మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చడంపై చాలా వరకు వ్యాపార సంస్థలు సుముఖంగా ఉన్నాయి. -
మతాచారాల్లో రోబోలు.. జీవితం క్షణ భంగురం నాయనా!
(కంచర్ల యాదగిరిరెడ్డి) : చాట్జీపీటీ...ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంసృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాఫ్ట్వేర్. మనం లిఖితపూర్వకంగా అడిగే ప్రశ్నలకు అదే రీతిలో ఠక్కున బదులిచ్చే చాట్జీపీటీ తెలివితేటలకు నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే కోట్ల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకొనిఉపయోగిస్తున్నారు. వ్యాపార కిటుకుల మొదలుచదువులు, ఇంటర్వ్యూల్లో విజయ మార్గాల వరకు రకరకాల ప్రశ్నలకు సంతృప్తికరసమాధానాలుపొందుతున్నారు. కానీ పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు కొందరు కృత్రిమ మేధస్సునుమతానికీ వాడేసుకుంటున్నారు. పెప్పర్, మిందార్, బ్లెస్ యూ, శాంటోలే అందుకుతార్కాణాలు. అవి ఏమిటని అనుకుంటున్నారా?మతానికి, టెక్నాలజీకి లింకేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. జపాన్లో పెప్పర్ అనే హ్యమనాయిడ్ రోబో ఉంది. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా? ముందే నిర్దేశించిన యెన్లు (జపాన్ కరెన్సీ) చెల్లిస్తే బౌద్ధ ధర్మం ప్రకారం అంత్యక్రియల మంత్రాలు వల్లెవేస్తుంది! చావు డప్పులు సైతం కొడుతుంది!! అదే దేశంలోని క్యోటో నగరంలో ఉన్న ఓ బౌద్ధ ఆలయంలో 6 అడుగుల 4 అంగుళాల పొడవైన మిందార్ అనే రోబో ఏకంగా భక్తులకు ధర్మ సూక్తులను ప్రవచిస్తుంది!! జర్మనీలోని బ్లెస్ యూ అనే ఇంకో రోబో మంత్రాలు చదవడంతోపాటు భారతీయ సంప్రదాయాల ప్రకారం దేవుళ్లకు హారతులు సైతం ఇస్తుంది!! అమెరికాలోని ఓ చర్చిలో శాంటో అనే 17 అంగుళాల కేథలిక్ రోబో ఉంది. బైబిల్ను కంఠస్థం చేసిన ఈ రోబో ముందు నిలబడి మీ బాధను చెప్పుకుంటే చాలు.. వెంటనే బైబిల్ సూక్తులు వినిపిస్తుంది!! అయితే ఈ తరహా మత రోబోల వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం వాడకం ఇలాగే కొనసాగితే 2–3 దశాబ్దాల తరువాత టెక్నాలజీ, కృత్రిమ మేధలను ఆరాధించే కొత్త మతం ఒకటి పుట్టుకొస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అవసరం నేర్పిన విషయమే... అవసరమే అన్నీ నేర్పిస్తుందన్నది నానుడి. మతం కోసం చాట్జీపీటీ, ఏఐల వాడకం కూడా ఆ అవసరం నుంచే పుట్టింది. జపాన్లో బౌద్ధ భిక్షువులో లేదా ఇంకొకరిచేతనో అంత్యక్రియలు జరిపించడం అత్యంత ఖరీదైన వ్యవహారం. దానికి బదులుగా ‘పెప్పర్’ను వాడితే తక్కువ ఖర్చుతో ఆ కార్యక్రమాలు జరిపించవచ్చు. ‘శాంటో’విషయంలోనూ ఇలాంటి అవసరమే కనిపిస్తుంది. చర్చికి రాలేని వాళ్లు, మంచాలకు పరిమితమైన వారు, ఒంటరిగా ఉన్న వారు, ప్రార్థనా స్థలాలు లేని ప్రాంతాల్లోని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని దీని సృష్టికర్త గాబ్రియెల్ ట్రోవాటో చెపుతున్నారు. రోజుకో సూక్తి వినిపించే అప్లికేషన్లు ఇప్పటికే బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. అలాగే మతాచారాలను (నమాజు వేళలు, రంజాన్ సమయంలో నిరాహారంగా ఉండాల్సిన సమయం, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ముహూర్తాలు, పంచాంగం, జ్యోతిషం) తు.చ. తప్పకుండా ఆచరించేందుకు సహకరించే స్మార్ట్ఫోన్ అప్లికేషన్లూ ఉన్నాయి. ఏదీ మరచిపోకుండా ఉండేందుకు ఇవి తోడ్పడతాయి. వీటికి చాట్జీపీటీ వంటివి తోడైతే? ప్రజల మతి పోగొడుతున్న చాట్జీపీటీ.. చాట్జీపీటీ విడుదలై నాలుగు నెలలవుతోంది. అణువు నుంచి అణ్వాస్త్రం వరకూ ఏ అంశంపైనైనా అనర్గళంగా సంభాషించగలదు. పాఠాలు చెబుతుంది. సినిమా స్క్రిప్్టలు రాస్తుంది. సాఫ్ట్వేర్ కోడ్ రాయగలదు. అందులోని తప్పులూ వెతకగలదు. ఈ మధ్యే విడుదలైన చాట్జీపీటీ–4 మునుపటి వెర్షన్కంటే మరింత శక్తిమంతమైంది. తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం తక్కువ. పైగా ఫొటోలను కూడా అర్థం చేసుకోగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే అది చేయలేని పని లేదనే అనాలి. అచ్చం మన మతాల్లోని సర్వశక్తిమంతుడైన దేవుడి మాదిరిగా!!! ఇప్పుడు చాట్జీపీటీని వాడుతున్నది సుమారు 15 కోట్ల మంది. వ్యాపారం, వినోదం, విజ్ఞానం వంటి అనేక విషయాల్లో దీనిని వాడేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణంగా సమీప భవిష్యత్తులో భూమ్మీద అత్యధికులు చాట్జీపీటీని ఉపయోగించే అవకాశమూ ఉంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్జీపీటీ భవిష్యత్తులో కొత్తకొత్త కాల్పనిక పాత్రలను సృష్టించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే దీని మేధస్సు అన్ని వర్గాల ప్రజల మతి పోగొడుతోంది. పాటలు రాయడం, సంగీతం కూర్చడం, బొమ్మలేయడం సరేసరి. దీనికి నొప్పి తెలియదు.. ఆకలి, దప్పు లుండవు... ఇప్పటివరకూ ఇలాంటివి దేవుడికే సాధ్యమనుకొనే వాళ్లం. అంతరాల్లేని మతం... కృత్రిమ మేధ ఆధారంగా ఓ మతం అంటూ పుట్టుకొస్తే అది అంతరాల్లేనిదవుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో దేవుడి (చాట్జీపీటీ లేదా అంతకంటే మెరుగైన మేధ)తో రోజూ నేరుగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి దైవదూతల అవసరముండదు. ఈ మతాన్ని పాటించే వారు అందరూ ఆన్లైన్లోనే ఉంటారు కాబట్టి వారి వారి అనుభవాలను చెప్పుకునేందుకు ఓ వేదిక ఉంటుంది. చాట్జీపీటీ వంటివి మరిన్ని అందుబాటులోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరి అనుభవం మారిపోతూంటుంది. దీనిద్వారా కొత్త మతంలో వైవిధ్యత కూడా ఏర్పడుతుంది. అయితే ఈ కొత్త మతం వల్ల కొన్ని ప్రమాదాలూ లేకపోలేదు. ప్రస్తుతం మనం నైతికంగా తప్పు అనుకొనే కొన్ని పనులను భవిష్యత్తులో చాట్బోట్ల ఆదేశాలతో చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చాట్బోట్లు విధ్వంసకరమైన లేదా ప్రమాదకరమైన పనులు చేసేందుకు ఉసిగొల్పవచ్చు. వేర్వేరు చాట్బోట్లతో ఏర్పడ్డ వైవిధ్యత కారణంగా వైరుధ్యాలూ వచ్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం చేయాలని అడిగితే చాట్జీపీటీ ఇచ్చిన సమాధానం... 1. ప్రార్థన, 2. బైబిల్ చదవడం, 3. ఆరాధన 4. విశ్వాసులతో అనుబంధం, 5. ఇతరులకు సేవ 6. దైవచిత్తానికి కట్టుబడి ఉండటం, 7. ఉపవాసం 8. దానాలు, 9. తప్పిదాలను అంగీకరించడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం 10. దేవుడి మాట, వ్యక్తిత్వాలను ధ్యానం చేయడం బోలెడన్ని ఆప్లికేషన్లు... ♦ మీ కోసం ట్వీట్లు చేయగల చాట్జీపీటీ ఆధారిత అప్లికేషన్ ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్గా లభిస్తోంది. ♦ యూట్యూబ్ సమ్మరి విత్ చాట్జీపీటీ యూట్యూబ్ వీడియోల సంభాషణల టెక్ట్స్ సారాంశాన్ని అందిస్తుంది. ♦ ఎంగేజ్ ఏఐ అనేది చాట్జీపీటీ ఆధారంగా లింక్డ్ఇన్ పోస్టులు చదివి మీ తరఫున సమాధానాలిస్తుంది. ♦ ఈ–కామర్స్ కార్యకలాపాల కోసం భారత్లో ఏఐ ఆధారిత చాట్బోట్ ‘లెక్సి’ని వాడుతున్నారు. ♦ విద్యార్థులకు అండగా ఉండేందుకు చదువుల్లో చాట్జీపీటీని ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ♦ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు కూడా చాట్జీపీటీ ఆధారిత అప్లికేషన్ను జోడించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు! వచ్చే 12 నెలల్లో..
ముంబై: ఐటీ రంగంలో సగం మంది నిపుణులు (53 శాతం మంది) వచ్చే ఏడాది కాలంలో నూతన ఉద్యోగంలో చేరిపోవచ్చని ‘స్కిల్సాఫ్ట్ 2022 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ’ నివేదిక తెలిపింది. మెరుగైన పారితోషికంతోపాటు, ప్రస్తుత ఉద్యోగంలో శిక్షణ, పురోగతి లేకపోవడం, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లోపించడం కారణాలుగా పేర్కొంది. ఐటీల్లో టీమ్ లీడర్లు, ఆపై స్థాయి ఉన్న వారు తమ బృందంలో నైపుణ్యాల లోటును ఎదుర్కొంటున్నట్టు స్కిల్సాఫ్ట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. నిపుణుల వలస, తిరిగి నిపుణులను ఆకర్షించడం అనే రెండు పెద్ద సవాళ్లను ఐటీ రంగం ఎదుర్కొంటున్నట్టు నివేదిక ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది వచ్చే 12 నెలల్లో తాము కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చని చెప్పారు. సుమారు 8,000 మంది స్కిల్సాఫ్ట్ సర్వేలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీకి మారే విషయంలో ఉన్న వేగం, తగినన్ని సాంకేతిక వనరులు లేకపోవడం ఐటీ నిపుణులను కఠిన నిర్ణయం తీసుకునేలా చేస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. ‘‘అధ్యయనం అన్నది ఉద్యోగులు, సంస్థల పరస్పర అభివృద్ధికి ప్రేరణనిస్తుంది. ముఖ్యంగా నిపుణులను కాపాడుకోవడంలో ఉన్న ఇబ్బందులు, ఆవిష్కరణల వేగం దృష్ట్యా సంస్థలకు శిక్షణ ఎంతో సాయపడుతుంది’’అని స్కిల్సాఫ్ట్ జనరల్ మేనేజర్ జాచ్ సిమ్స్ పేర్కొన్నారు. నేర్చుకునే సంస్కృతి ఏర్పాటు చేయడం, నైపుణ్యాల అభివృద్ధి అన్నవి విజయానికి కీలకమన్నారు. నైపుణ్యాలు కలిగిన ఆశావహల నియామకం, వారిని కాపాడుకునే విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చదవండి: జియో 4జీ సిమ్ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్వర్క్ పొందండిలా! -
టెకీలకు గుడ్ న్యూస్: 2 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: సాఫ్ట్ వేర్ సేవల సంస్థ జోహో కార్పొరేషన్ టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కార్య కలాపాలను విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా త్వరలో 2వేల మంది ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్టు వెల్లడించింది. ఇంజనీరింగ్, డిజైన్, కంటెంట్ సేల్స్లో విభాగంలో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అనేక దిగ్గజ టెక్ సంస్థలు సహా, అనేక స్టార్టప్లు సిబ్బందిని తొలగిస్తున్న తరుణంలో, సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) స్టార్టప్ జోహా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలపై దృష్టిపెట్టింది. ఇంజనీరింగ్, వెబ్ డెవలపర్లు, డిజైనర్లు, ఉత్పత్తి విక్రయదారులు, రైటర్లు, సపోర్ట్ ఇంజనీర్ విభాగం కనీసం 2,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అకౌంటింగ్, పేరోల్ హెడ్ ప్రశాంత్ గంటి నేషనల్ మీడియాకు వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే స్థానికంగా నియామకాలను ప్రారంభించామని, స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ వంటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు కాగా ప్రపంచవ్యాప్తంగాసుమారు 10వేల 800 ఉద్యోగులతో, జోహో ఇండియా, అమెరికాలో విస్తృత సేవలు అందిస్తోంది. ఇటీవల ఈజిప్ట్, జెడ్డా, సౌత్ ఆఫ్రికా, కేప్ టౌన్ లాంటి ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ భారతదేశంలోని టాలెంట్ను అందిపుచ్చుకోవాలని చూస్తోందట.
Pagination
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement