హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గన్మెన్లను కేటాయించమని తనను కోరిన మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్ప బుధవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని భద్రతా కమిటీ చూస్తుందని తాను దాసరికి వెల్లడించానని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కూడా తమకు భద్రత పెంచాలని కోరారని చెప్పారు. భద్రత కమిటీ మీ అంశాన్ని పరిశీలిస్తుందని వారికి వివరించినట్లు తెలిపారు.
ఎవరికి భదత్ర కల్పించాలని ఎవరికి వద్దు అనే అంశంలో తన ప్రమేయం ఏమీ ఉండదని చినరాజప్ప వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర బోగ్గు శాఖ మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావుకు భద్రతగా ఉన్న గన్మెన్ల సౌకర్యాన్ని ఇటీవల ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దాంతో తనకు గన్మెన్ల భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్పను దాసరి నారాయణరావు కోరిన విషయం తెలిసిందే.