రివర్స్ గేర్ కాంగ్రెస్ నుంచి జనం మార్పు కోరుకుంటున్నారు
రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు
మీట్ ది ప్రెస్లో మాజీ మంత్రి హరీశ్రావు
చెరో 8 ఎంపీ సీట్లూ గెలుచుకునేలా కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం
రేవంత్కు ఆంధ్రా మూలాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు చెప్పారు. రివర్స్ గేర్లో వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గెలవాలని వారు భావిస్తున్నారని వివరించారు.
రాష్ట్రంలో చెరో 8 లోక్సభ స్థానాలు గెలుచుకునేలా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఆంధ్రా మూలాలు కలిగిన సీఎం రేవంత్రెడ్డి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీకి మూటలు పంపడంపైనే శ్రద్ధ
‘సీఎం రేవంత్ చెప్తున్న ప్రజాపాలన ఫార్స్గా మారింది. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఓ వైపు దూషిస్తూ, మరోవైపు ఒట్లు పెడుతున్నారు. ప్రజలను నిరంతరం మోసగించడం సాధ్యం కాదనే విషయం గ్రహించి కేసీఆర్ను దుర్భాషలాడుతున్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలు, పరిపాలనపై లేదు.
రాష్ట్రంలో పాలనకు బదులుగా పగలు, ప్రతీకారాలు నడుస్తున్నాయి. పాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేయడం తిరోగమన ఆలోచన. ప్రజాపాలనలో వచ్చిన 3.50 లక్షల దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..’ అని హరీశ్ డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాజధానికి రేవంత్ సహకరించే చాన్స్
‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్య వాదులు కోరుతున్నారు. ఆంధ్రా మూలాలు కలిగిన రేవంత్రెడ్డి దానికి సహకరించే అవకాశముంది. గతంలో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్దే ప్రధాన పాత్ర. తెలంగాణ ప్రయోజనాలను కాపా డటం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లలో గెలిపిస్తే బీఆర్ఎస్ కీలకంగా మారుతుంది..’ అని హరీశ్రావు చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న రేవంత్
‘రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటు న్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే అభివృద్ధి, పెట్టు బడుల సాధన, ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యం? రేవంత్ తీరుతో పెట్టుబడుదారులు పునరా లోచనలో పడుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్క డమే పనిగా పెట్టుకున్న రేవంత్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తూ కేసులు పెడుతు న్నారు..’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
‘దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం సహా ఏదీ ఇవ్వలేదు. బీజేపీ ఆదానీని మాత్రం ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది. నల్ల చట్టాలతో రైతులపై దాడులు, ఎస్సీ వర్గీకరణ, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వంటి అనేక అంశాలు బీజేపీ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ ఆధ్యాత్మికలో బీజేపీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు.