స్టాలిన్పై కేసు నమోదు
చెన్నై: తమిళనాడు పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్పై కేసు నమోదు చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి మెరీనా బీచ్లోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించి నానా రచ్చచేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం శనివారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి.
నిరసనలు మిన్నంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు.
మరోపక్క, అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన స్టాలిన్ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్కు ఫిర్యాదు చేసి మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టారు. దీనికి మద్దతుగా జల్లికట్టు తరహాలో జనాలు రావడంతో బుజ్జగించిన పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా పంపించేశారు. అనూహ్య గందరగోళానికి తెరతీసిన స్టాలిన్పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సంబంధిత వార్తలకై చదవండి