లాస్ట్ స్పీచ్.. ఒబామా హెచ్చరికలు! | Sakshi
Sakshi News home page

లాస్ట్ స్పీచ్.. ఒబామా హెచ్చరికలు!

Published Wed, Jan 11 2017 10:39 AM

లాస్ట్ స్పీచ్.. ఒబామా హెచ్చరికలు! - Sakshi

చికాగో: సమయం గడిచిపోతే ఎవరికైనా సరే అధికార మార్పిడి తప్పదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. చికాగో ఆయన వీడ్కోలు సమయంలో మాట్లాడుతూ ఉధ్వేగానన్ని నియంత్రించుకోలేక ఏడ్చేశారు. ఆ వెంటనే నవ్వుతూ అవకాశం ఉంటే తనకు మరో నాలుగేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగాలని ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తనకు ఎంతో మద్ధతుగా నిలిచిన అమెరికా ప్రజలతో పాటు భార్య మిషెల్లీ ఒబామాకు, కూతుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఏదైనా సాధించగలమని నిరూపించాం.. అయినా దేశం ముందు ఎన్నో సవాళ్లున్నాయని, బీ కేర్‌ఫుల్ అంటూ హెచ్చరించారు.
(చదవండి: వీడ్కోలు ప్రసంగంలో ఉద్వేగానికి లోనైన ఒబామా)

ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులను మట్టుబెట్టాం.. వేలాది మంది టెర్రరిస్టులను హతం చేశాం. దీనివల్ల గత ఎనిమిదేళ్లలో దాడులు చేసేందుకు ఏ ఉగ్రసంస్థ కుట్రపన్నలేకపోయింది అన్నారు. చివరగా భవిష్యత్తు ఎప్పుడూ అమెరికావాసులదేనని పేర్కొన్నారు. ఒబామా వీడ్కోలు సమావేశానికి డొమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ నేతలు, ఉన్నతాధికారులతో పాటు ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

ఒబామా చివరి ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు:
ఎనిమిదేళ్ల కింద మీరు నాకు తొలిసారి అవకాశం ఇచ్చారు. మరోసారి ఎంతో అండగా నిలిచారు
దేశ అధ్యక్షులను కాదు, ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. దాంతో మనం ఏదైనా సాధించవచ్చు. ఎలాంటి మార్పయినా సాధ్యపడుతుంది
జో బిడెన్ నా ఫస్ట్ నామిని అండ్ బెస్ట్ నామిని. దీనివల్ల నాకు ఓ సోదరుడు దొరికాడు
జాత్యహంకార దాడులు జరగకుండా ఎన్నో చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను
గత పదేళ్లలో ప్రజాస్వామ్యం మరింత మెరుగుపడింది. దేశంలో చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి
అధికార మార్పిడి ఎక్కడైనా తప్పనిసరి. ఇక్కడ నా నుంచి డొనాల్డ్ ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు
ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా గ్రేట్ అగైన్ తరహాలో కాకుండా.. ప్రజాస్వామ్యం, సమానత్వం, అశావహ ధృక్పథం అంశాలను కీ పాయింట్‌గా తీసుకోవాలి
విశ్వాసం అంటే ఏంటో తాను చికాగో ప్రజల నుంచి నేర్చుకున్నాను. ఇది నాలో ఎంతో స్ఫూర్తిని రగిలించింది
ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ అప్పుడే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి
దేశ ప్రజలందరూ తమ నిజాయితీతో తనను బెట్టర్ ప్రెసిడెంట్‌గానూ, ఉత్తమ వ్యక్తిగానూ తీర్చిదిద్దారు
మన దేశాన్ని ప్రత్యేకంగా, ఇతర దేశాలతో పోల్చుకుంటే గొప్పగా నిలుపుకునే సామర్థ్యం మనకు ఉందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర దేశాలపై ఆధారపడకూడదని తన ప్రసంగం ద్వారా మరోసారి హెచ్చరించారు

Advertisement
Advertisement