Afghanistan: ఇంకా లభించని అమెరికా సైన్యానికి అప్పగించిన చిన్నారి ఆచూకీ | Sakshi
Sakshi News home page

Afghanistan: ఇంకా లభించని అమెరికా సైన్యానికి అప్పగించిన చిన్నారి ఆచూకీ

Published Sat, Nov 6 2021 9:28 PM

Baby Handed To US Troops In Kabul Airlift Chaos Still Missing - Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌లు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అఫ్గన్‌ తాలిబన్‌ల వశం కావడంతో భయాందోళను గురైన అక్కడి ప్రజలు తాలిబన్‌ల పాలనలో జీవించలేమని ఇతర దేశాలకు పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. తమ ప్రాణాలను లెక్కచేయకుండా విమానం రెక్కలపై కూడా ఎక్కి ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఘటనలన్నీ ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. శరణార్ధుల తరలింపు సందర్భంగా అమెరికా సైనికులకు అప్పగించిన ఓ రెండు నెలల వయసున్న చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఇప్పటికీ ఆ పాప తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: Slave Room: రెండు వేల ఏళ్ల నాటి బానిస గది ఇదిగో..!

కాగా అప్ఘనిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పదేళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన మిర్జా అలీ (35), తన భార్య సూరయా (32), అతడి ఐదుగురు పిల్లలతో దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతూ తమ పరిస్థితి ఎలా ఉన్నా.. తమ రెండు నెలల కొడుకు బాగుండాలని చిన్నారి(సోహెల్)ని ఆ సైనికుడి చేతికి అందించాడు. ఆ తర్వాత అరగంటకు మీర్జా అలీ తన కుటుంబంతో సహా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. అనంతరం తన కొడుకు కోసం వెతుకులాట ప్రారంభించారు.
చదవండి: నలుగురు మహిళల దారుణ హత్య.. ప్రకటించిన తాలిబన్లు

ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. అక్కడే ఉన్న సైనికులను అడిగి చూశాడు. ఎయిర్‌ర్టులో చిన్న పిల్లలకు ప్రమాదమని, వేరే ప్రదేశానికి తీసుకెళ్లి ఉంటారని వాళ్లు చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అయితే సైనికులు చెప్పిన ప్రదేశంలో పిల్లలెవరూ లేరు . గంటల తరబడి వెతికినా ఫలితం లేకపోవడంతో బరువెక్కిన హృదయంతోనే.. కుటుంబ సభ్యులతో కలిసి రెస్క్యూ విమానంలో ఖతర్ అక్కడి నుంచి జర్మనీ వెళ్లి, అక్కడ నుంచి శరణార్థిగా అమెరికా చేరుకున్నారు. ప్రస్తుతం టెక్సాస్‌లోని శరణార్థుల కేంద్రంలో ఉంటున్న మీర్జా అలీ దంపతులు.. సోహెల్‌ జాడ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

 
Advertisement
 
Advertisement