2,000 నోట్లను ఇలా వాడేస్తున్నారట! | Sakshi
Sakshi News home page

2,000 నోట్లను ఇలా వాడేస్తున్నారట!

Published Thu, Jun 15 2023 5:14 AM

Fuel, jewellery, grocery top 3 preferred items for people offloading Rs 2,000 notes - Sakshi

న్యూఢిల్లీ: కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన తర్వాత ప్రజలకు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకోడానికి- ఇంధనం, ఆభరణాలు, రోజువారీ కిరాణా వస్తువుల కొనుగోళ్లు మొదటి మూడు ప్రాధాన్యతలుగా ఉన్నట్లు లొకేషన్‌ బేస్డ్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ పబ్లిక్‌ యాప్‌ నిర్వహించిన ఒక దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. (యూట్యూబర్లకు గుడ్‌ న్యూస్‌, 500 చాలట!)

55 శాతం మంది ప్రజలు తమ కరెన్సీ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి,  23 శాతం మంది వాటిని ఖర్చు చేయడానికి,  22 శాతం మంది మార్చుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది.  మే 19వ తేదీన  వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ దాదాపు సగం పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్‌ గత వారం పాలసీ సమీక్ష నిర్ణయాల సందర్భంగా  తెలిపారు. (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

ఆయన తెలిపిన సమాచారం ప్రకారం 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్లు వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయి.  వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయన్నారు. రూ.500 నోట్లు వెనక్కు తీసుకోవాలన్న యోచన లేదని, అలాగే కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకుని రాబోమని గవర్నర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  ఆయా అంశాలపై 22 రాష్ట్రాల్లో లక్షకుపైగా ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రాతిపదికన తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యాంశాలు ఇవీ...

తమ నోట్లను మార్చుకునేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని అడిగినప్పుడు 61 శాతం మంది ఈ ప్రక్రియలో తమకు ఎటు వంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మా ర్పిడి పక్రియ చాలా తేలిగ్గా ఉందని కేరళలో 75% మంది పేర్కొంటే, ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం, తమిళనాడులో 50% మంది తెలిపారు.  
ప్రజల్లో రూ.2000 నోటు మార్చుకోడానికి మాత్రం ఇబ్బందులు ఎదరవుతున్నట్లు 42 శాతం మంది తెలిపారు.  
సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తమ రూ.2000 నోటును మార్చుకునేందుకు ప్రభుత్వం తమకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.  
2,000 నోట్ల మార్పిడి రూ.20,000 కంటే ఎక్కువగా ఉండాలని 44 శాతం మంది పేర్కొన్నారు.  ప్రజలు రూ. 2,000 కరెన్సీ నోటును డిపాజిట్‌ చేయవచ్చు.  లేదా తక్కువ విలువ కలిగిన కరెన్సీతో బ్యాంకులో మార్చుకోవచ్చు, అయితే ఒకేసారి రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు.
ఇక రూ. 2,000 నోట్లను ఉపసంహరణ ప్రకటన తర్వాత  దేశీయంగా పసిడి, వెండిపై ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరి పే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యుయలర్లు మాత్రం 5–10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నాయనీ వార్తలు వెలువడ్డాయి.  
రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. అంతకుముందు వీటివాటా కేవలం 10 శాతంగా ఉండేది.  ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే,  2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి.  2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది.  
2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్‌బీఐ, ఈ నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  నిజానికి 2018–19లోనే ఆర్‌బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే.

 ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్‌ సక్సెస్‌ జర్నీ
మరిన్ని బిజినెస్‌ అపడేట్స్, ఇంట్రస్టింగ్‌ వార్తల కోసం చదవండి: సాక్షిబిజినెస్‌

 
Advertisement
 
Advertisement