టీఆర్‌ఎస్‌తో గడీల పాలనే | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తో గడీల పాలనే

Published Thu, Apr 17 2014 4:34 AM

Social telangana not possible with trs

 నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి టిక్కెట్లు ఇచ్చిన టీఆర్‌ఎస్‌తో సామాజిక తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలతో మళ్లీ గడీల పాలన వస్తుందన్న భయం ప్రజల్లో నెలకొందన్నారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో బుధవారం ఉదయం విలేకరుల సమావేశంలో డీఎస్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే, వారు ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండడంతో పాటు పార్టీ జెండాలను మోసిన వారిని పక్కనపెట్టడంపై టీఆర్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 దేశంలోనే తెలంగాణ ప్రాంతాన్ని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని తాను అనుకోవటంలేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులే తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని డీఎస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని పార్టీల కంటే బాగుందని కితాబిచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవడం, యువత, మహిళలు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు.

 మేనిఫెస్టోలో తన సూచనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇప్పటికే తాను ’200 కోట్లతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. 2016 వరకు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులు పూర్తయి సిరికొండ మండలం వరకు సాగు,తాగునీరు అందిస్తామన్నారు. సిరికొండ లో రెండు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ధర్పల్లిలో జూనియర్ ,పాలిటె క్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

 
Advertisement
 
Advertisement