బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు

Published Tue, Jul 12 2016 2:21 AM

బుల్లితెర నటి శ్రీవాణిపై ఫిర్యాదు - Sakshi

ప్లాట్ విషయమై ఘర్షణ ఇరువర్గాల ఫిర్యాదులు

 పరిగి : తనపై దాడిచేశారని పరిగికి చెందిన ఓ మహిళ బుల్లి తెర నటి శ్రీవాణిపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో తమపై కూడా దాడికి యత్నించారని శ్రీవాణి పరిగికి చెందిన అనూషపై ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి శ్రీవాణి, ఆమె సోదరి శ్రీకన్య మరికొందరితో కలిసి సోమవారం పరిగికి వచ్చారు. పరిగికి చెందిన అనూష ఇంటికి వెళ్లి ఆమె ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని, వేరే వారికి విక్రయించేందుకు సదరు స్థలం చూపించారు.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న అనూష బయటికి రావడంతో గొడవ జరిగింది. అరుుతే, శ్రీవాణి హైదరాబాద్ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులను తీసుకువచ్చి తనపై దాడి చేశారని అనూష పరిగి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనూష ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థలంలో తమకు కూడా వాటా ఉందని అడిగేందుకు వెళితే తమపై అనూష దాడికి యత్నించిందని శ్రీవాణి సైతం అనూషపై పరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 తాను ఉంటున్న ఇంటి స్థలానికి శ్రీవాణికి ఎలాంటి సంబంధం లేదని అనూష పేర్కొనగా..తమ తండ్రి పరిగి గ్రామస్తుడని, ప్రస్తుతం అనూష ఉంటున్న ఇంటి స్థలంలో తమకు వాటా ఉందని శ్రీవాణి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై సీఐ ప్రసాద్‌ను వివరణ కోరగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. ఇంకా కేసు నమోదు కాలేదు.

Advertisement
Advertisement