‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ | Sakshi
Sakshi News home page

‘ఖేలో ఇండియా’ కేంద్రంగా వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌

Published Sun, Oct 18 2020 5:35 AM

YSR Sports School upgraded to Khelo India State Centre of Excellence - Sakshi

న్యూఢిల్లీ: భవిష్యత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌లను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా చోటు దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ శనివారం ప్రకటించింది. ఇందులో వైఎస్సార్‌ జిల్లాలోని ‘డా. వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌’ ఎంపిక కావడం విశేషం.

ఈ పథకంలో స్థానం దక్కడంతో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో మౌలిక వసతులు,  హై పెర్ఫార్మెన్స్‌ అధికారులు, కోచ్‌లు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో 14 సెంటర్లను కేఐఎస్‌సీఈగా మారుస్తున్నట్లు క్రీడా శాఖ ప్రకటించగా... తాజా జాబితాతో వాటి సంఖ్య 23కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, చంఢీగఢ్, గోవా, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, త్రిపుర, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్‌లు చేరాయి.

Advertisement
 
Advertisement