-
ముంబై అతలాకుతలం
ముంబై: అకాల వర్షాలు, దుమ్మూ ధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలమైంది. నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైవ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం ధాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘట్కోపర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమంగా హోర్డింగ్ ఈదురుగాలుల ధాటికి సాయంత్రం కుప్పకూలింది. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్టు అధికారులు చెబుతున్నారు! గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున వారిని కాపాడేందుకు ప్రయతి్నస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గగ్రానీ చెప్పారు. జాతీయ విపత్తు స్పందన బృందంతో పాటు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భారీ హైడ్రా క్రేన్లు తదితరాలతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పెట్రోల్ బంక్లో కనీసం 30కి పైగా ఆటోలు, బస్సులు, లగ్జరీ కార్లున్నట్టు ఒక కానిస్టేబుల్ తెలిపారు. వాటిలో పలు వాహనాలు హోర్డింగ్ కిందే చిక్కుకుపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాదస్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. రైళ్లు, విమానాలకు అంతరాయం గాలివాన ధాటికి ముంబైలో పలు ఇతర చోట్ల కూడా బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగిన ఉదంతాల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కనీసం మరో నలుగురు మరణించినట్టు సమాచారం. ప్రతికూల వాతావరణం వల్ల సోమవారం గంటపాటు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గాలి దుమారం ధాటికి ఏమీ కనిపించని పరిస్థితి నెలకొనడంతో పలు విమానాలను దారి మళ్లించారు. మెట్రో, లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నగరంలో సోమవారం అర్ధరాత్రి దాకా ఈదరగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కొనసాగింది. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. -
చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్ప్రెస్ వే..
బీజింగ్: చైనాలో ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని మెయిజౌ నగరంలో బుధవారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. చైనాలో ‘లేబర్ డే’సందర్భంగా ఐదు రోజుల సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి. దీంతో గ్వాంగ్డాంగ్– ఫుజియాన్ ఎక్స్ప్రెస్ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెయిజౌ నగరంలోని కొండప్రాంతంలో ఉన్న 18 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అనూహ్య పరిణామంతో 20 వరకు వాహనాలు అందులో పడిపోయాయి. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్న 54 మందిలో 24 మంది చనిపోగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. -
Israel-Hamas war: రఫాపై ఇజ్రాయెల్ దాడులు 22 మంది మృతి
రఫా: గాజా ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లకు పట్టున్న రఫాలోకి తమ సైన్యం త్వరలో ప్రవేశించనుందంటూ హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులకు దిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆరు నెలలకు పైగా భీకర దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉండగా, కాల్పుల విరమణకు ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. -
కెన్యాలో కూలిన డ్యామ్
నైరోబీ(కెన్యా): ఆఫ్రికా దేశం కెన్యాలో జలాశయం ధ్వంసమై నివాసప్రాంతాలను ముంచెత్తడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది గల్లంతయ్యారు. సుమారు 109 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. తరచూ ఆకస్మిక వరదలు సంభవించే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మయి మహియులో ఇటీవలి వర్షాలకు పొంగి పొర్లుతున్న పాత కిజాబె డ్యాం ఆనకట్ట కొట్టుకుపోయింది. దీంతో వరద ఒక్కసారిగా నివాస ప్రాంతాలను ముంచెత్తిందని, ప్రధాన రహదారి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో వరద పోటెత్తడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. -
తైవాన్లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్లో ఉంది. -
లోయలో పడ్డ తవేరా..10 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ హైవేపై రంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. తవేరా ట్యాక్సీ అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్తో పాటు అందరూ చనిపోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్స్్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
Israel-Hamas war: 25,000 దాటిన గాజా మృతులు
రఫా(గాజా స్ట్రిప్): తమతమ మతసంబంధ పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం ఘర్షణలతో మొదలై మెరుపు దాడులతో తీవ్రతరమై మహోగ్రరూపం దాలి్చన హమాస్– ఇజ్రాయెల్ పోరు పాతికవేల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మరోవైపు వంద మందికిపైగా బందీలను విడిపించుకున్నాసరే అందర్నీ విడిపిస్తామని, హమాస్ సభ్యులందర్నీ హతమారుస్తామని ఇజ్రాయెల్ సేనల ప్రతినబూనడం చూస్తుంటే యుద్ధ బాధితులు, మరణాల సంఖ్య ఇక్కడితో ఆగేలా లేదు. యుద్ధం ఇంకొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులు తాజాగా ప్రకటించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా బందీలను విడిపించలేకపోవడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు ప్రదర్శలు పెరిగాయి. -
Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది. వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది. మృత్యు నగరాలు ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి! ఫలించని దౌత్యం ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Iran explosions: రక్తమోడిన ర్యాలీ
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఎవరీ సులేమానీ? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్కు మద్దతు పలికే గాజా స్ట్రిప్లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్కు, లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్కు, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది. ఎందుకు చంపారు? 2020 జనవరిలో ఇరాక్లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే. ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది. 2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. -
Israel-Hamas war: సెంట్రల్ గాజాపై భీకర దాడులు..
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాపై మరోసారి విరుచుకుపడింది. ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు వెల్లడించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లపై యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మరుసటి రోజే సైన్యం దాడులు ఉధృతం చేయడం గమనార్హం. ఆదివారం ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంపై క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. 55,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా పశి్చమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాదులు పశ్చిమ దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఎర్ర సముద్రంలో భారీ కంటైనర్ షిప్ను ధ్వంసం చేయడానికి హౌతీ ముష్కరులు ప్రయోగించిన రెండు యాంటీ–షిప్ బాలిస్టిక్ క్షిపణులను మధ్యలోనే కూలి్చవేశామని అమెరికా సైన్యం ఆదివారం ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత ఇదే నౌకపై దాడి చేయడానికి నాలుగు పడవలు ప్రయతి్నంచాయని వెల్లడించింది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని, తమ ఎదురు కాల్పుల్లో సాయుధ దుండగులు హతమయ్యారని పేర్కొంది. -
రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సూరత్: గుజరాత్లోని సూరత్లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
గుజరాత్లో అకాల వర్షాలు..
అహ్మదాబాద్: గుజరాత్ వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో 20 మంది వరకు చనిపోయినట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది. దహోడ్ జిల్లాలో నలుగురు, భరూచ్లో ముగ్గురు, అహ్మదాబాద్, అమ్రేలీ, బనస్కాంత, బోటడ్, ఖేడా, మెహ్సానా, పంచ్మహల్, సబర్కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవ్భూమి ద్వారకల్లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారని ఒక అధికారి చెప్పారు. రాష్ట్రంలోని 252 తాలుకాలను గాను 234 చోట్ల ఆదివారం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, సౌరాష్ట్ర ప్రాంతంలోని సెరామిక్ పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రానికి మరింత వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. -
చైనాలో భారీ అగ్ని ప్రమాదం
బీజింగ్: చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్ నగరంలోని లిషి ప్రాంతంలో గురువారం ఉదయం 6.50 గంటలకు ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గని కంపెనీకి చెందిన అయిదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు భవనమంతటికీ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది శ్రమించి మంటలను మధ్యాహ్నం 1.45కి అదుపులోకి తెచ్చారని చెప్పారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే వీటికి కారణమని చెబుతున్నారు. -
Israel-Hamas war: స్కూళ్లు, ఆస్పత్రులపై దాడులు
టెల్అవీవ్: గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు మరింతగా చొచ్చుకుపోతున్నాయి. శనివారం మరిన్ని ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసినట్టు సైన్యం ప్రకటించింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో జరిగిన బాంబు, క్షిపణి దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆంబులెన్సులో పారిపోతున్న ఉగ్రవాదులను ఏరేయడానికి దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతోపాటు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలో ఓ స్కూలుపై జరిగిన క్షిపణి దాడిలో మరో 15 మంది దాకా మరణించారు. దాడులు ఉత్తర గాజాలోని ఐరాస శరణార్థి శిబిరాలకు కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇజ్రాయెల్ హెచ్చరిక మేరకు భారీ సంఖ్యలో దక్షిణాదికి వలస వెళ్లిన వారు పోగా ఇంకా 3 లక్షల మంది దాకా ఉత్తర గాజాలోనే చిక్కుబడ్డారు. వీరంతా ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పోరులో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 9,500 దాటినట్టు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, హమాస్ చీఫ్ నివాసంపై కూడా క్షిపణి దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి. సాయం... తక్షణావసరం గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లకు అత్యవసరాలు కూడా అందని దుస్థితి అలాగే కొనసాగుతోంది. అతి త్వరలో లక్షలాది మంది ఆకలి చావుల బారిన పడే ప్రమాదముందని అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస తదితర అంతర్జాతీయ సంస్థల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజావాసులకు మానవీయ సాయం అందేలా చూడాలని అమెరికా, యూరప్తో సహా అంతర్జాతీయ సమాజమంతా ముక్త కంఠంతో ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేస్తున్నాయి. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే స్పందించాలని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కాకపోతే యుద్ధక్షేత్రంలో చిక్కుబడ్డ పౌరులు దక్షిణాదికి పారిపోయేందుకు వీలుగా శనివారం మూడు గంటలపాటు దాడుల తీవ్రతను తగ్గించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనావాసులకు అత్యవసర సాయం అందేలా చూసే మార్గాంతరాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. రోజుకు ఆరు నుంచి 12 గంటల పాటు కాల్పుల విరామ ప్రకటించి మానవీయ సాయం అందేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు వీలు కలి్పంచాలని ఈజిప్ట్, ఖతర్ కోరుతున్నాయి. అలాగే బందీల విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనియన్లలో వృద్ధులు, మహిళలను వదిలేయాలని ప్రతిపాదిస్తున్నాయి. వీటిపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా స్పందించలేదు. రోజుకు రెండే బ్రెడ్డు ముక్కలు గాజావాసులు సగటున రోజుకు కేవలం రెండు బ్రెడ్డు ముక్కలు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నట్టు అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస సంస్థల డైరెక్టర్ థామస్ వైట్ వాపోయారు. అవి కూడా ఐరాస సేకరించిన పిండి నిల్వల నుంచే వారికి అందుతున్నట్టు చెప్పారు. గాజాలో ఒక్క ప్రాంతం కూడా సురక్షితమని చెప్పడానికి వీల్లేకుండా ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవీయ చట్టాలను గౌరవిస్తూ పాలస్తీనావాసులకు సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కానీ మానవీయ సాయం నిమిత్తం దాడులకు కాస్త విరామమివ్వాలన్న అంతర్జాతీయ విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. తమ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దాడులను తగ్గించేది లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ కూడా సమ్మతం కాదన్నారు. మరోవైపు ద్వంద్వ పౌరసత్వాలున్న 380 మందికి పైగా పాలస్తీనియన్లు శుక్రవారం ఈజిప్టు చేరుకున్నారు. తామిక ఇజ్రాయెల్పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్టేనని హెజ్బొల్లా నేత సయ్యద్హసన్ నస్రల్లా ప్రకటించారు. -
Israel-Hamas war: గాజాలో మరణ మృదంగం
ఖాన్ యూనిస్/జెరూసలేం: హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులు ఉధృతం చేస్తుండడం గాజాలో సాధారణ పాలస్తీనియన్లకు ప్రాణసంకటంగా మారింది. సోమవారం మరిన్ని దళాలు ఇజ్రాయెల్ భూభాగం నుంచి గాజాలోకి అడుగుపెట్టాయి. ఇజ్రాయెల్ సేనలు గాజాలోకి మరింత ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాలో 24 గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువూ గాలిస్తున్నాయి. గాజాలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి అయిన ‘టర్కిష్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్’ సమీపంలోనే ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి స్వల్పంగా ధ్వంసమయ్యింది. ఉత్తర, దక్షిణ గాజాను అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారిని ఇజ్రాయెల్ యుద్ధట్యాంకులు, బుల్డోజర్లు దిగ్బంధించాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. ఇందుకు కారణం ఏమిటన్నది బయటపెట్టడం లేదు. ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వెళ్లలేకపోతున్నారు. ఉత్తర గాజాలకు భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హమాస్ వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 304 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 8,306 మంది పాలస్తీనియన్లు మరణించారని, 21,048 మంది గాయపడ్డారు. ఇంకా 1,950 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించింది. ఇజ్రాయెల్లో 1,400మందికిపైగా మృత్యువాత పడ్డారు. అరకొర సాయమే ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న మానవతా సాయం ఇప్పుడిప్పుడే గాజాకు చేరుకుంటోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, దుస్తులు, నీటి శుద్ధి యంత్రాలు వంటివి అందుతున్నాయి. 75 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ తాజాగా ఈజిప్టు నుంచి దక్షిణ గాజాలోకి అడుగుపెట్టింది. ఈ వాహనాలు టన్నుల కొద్దీ ఆహారం, తాగు నీరు, పలు రకాల కీలక ఔషధాలను చేరవేశాయి. గాజాలోని 23 లక్షల జనాభాకు ఈ సాయం ఏమాత్రం చాలదని అక్కడి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. దక్షిణ గాజాలో రెండు నీటి సరఫరా పైపులైన్లను పునరుద్ధరించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. యూదుల కోసం విమానంలో గాలింపు ఇజ్రాయెల్ నుంచి వచి్చన విమానంలో యూదుల కోసం రష్యాలోని ముస్లింలు గాలించడం సంచలనాత్మకంగా మారింది. ఆదివారం టెల్ అవీవ్ నుంచి విమానం రష్యాలో ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన మాఖాచ్కలాలోని దగెస్తాన్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో యూదులు ఉన్నారన్న అనుమానంతో వందలాది మంది ముస్లింలు ఎయిర్పోర్టును దిగ్బంధించారు. పాలస్తీనా జెండాలను చేబూని, ఎయిర్పోర్టులోకి లోపలికి ప్రవేశించి అలజడి సృష్టించారు. యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చంపేయాలంటూ నినదించారు. కొందరు రన్వే పైకి దూసుకెళ్లారు. ఇజ్రాయెల్ విమానాన్ని చుట్టుముట్టారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూదులపై దాడి చేయడానికే ఎయిర్పోర్టుకు వచి్చనట్లు తెలుస్తోంది. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపైనా తిరగబడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అపహరించిన షానీ లౌక్ను హత్య చేశారు 23 ఏళ్ల యువతి షానీ లౌక్ ఈ నెల 7న ఇజ్రాయెల్లోని కిబుట్జ్లో ఓ సంగీత వేడుకలో ఉండగా హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడి చేశారు. కొందరిని కాలి్చచంపారు. షానీ లౌక్తోపాటు మరికొందరిని అపహరించారు. బందీలుగా బలవంతంగా గాజాకు లాక్కెళ్లారు. అయితే, మిలిటెంట్ల చెరలో షానీ లౌక్ క్షేమంగా ఉండొచ్చని ఆమె తల్లి, సోదరి భావించారు. త్వరలోనే ప్రాణాలతో తిరిగివస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే దుర్వార్త తెలిసింది. గాజాలో మిలిటెంట్లు ఓ యువతి మృతదేహాన్ని వాహనంలో ఉంచి, ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తూ గాజా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శవంగా మారిన ఆ యువతి షానీ లౌక్ అని తల్లి రికార్డా లౌక్, సోదరి అడీ లౌక్ గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇజ్రాయెలీ–జర్మన్ జాతీయురాలైన షానీ లౌక్ను మిలిటెంట్లు హత్య చేయడం దారుణమని, ఈ ఘటన తమను కలచివేసిందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది. -
గనిలో అగ్ని ప్రమాదం
లండన్: కజఖిస్తాన్లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది. మీథేన్ గ్యాస్ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్లో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ పనిచేస్తుంది. ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది. -
Jivitputrika festival: 24 గంటల వ్యవధిలో.. బిహార్లో 22 మంది నీటమునక
పట్నా: బిహార్లోని వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్పుత్రికా పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలేనన్నారు. ఈ పండుగ రోజు మహిళలు తమ సంతానం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటూ ఉపవాస దీక్షలు, నదీ స్నానాలు ఆచరించడం సంప్రదాయం. భోజ్పూర్లో బహియారా ఘాట్ వద్ద సోనె నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15–20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీ తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు అధికారులు వివరించారు. భోజ్పూర్లో అయిదుగురు, జెహానాబాద్లో నలుగురు, పట్నా, రొహతాస్ల్లో ముగ్గురు చొప్పున, దర్భంగా, నవడాల్లో ఇద్దరేసి, కైమూర్, మాధెపురా, ఔరంగాబాద్ల్లో ఒక్కరు చొప్పున జల సమాధి అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. -
టపాసుల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
హోసూరు (తమిళనాడు): హోసూరు–బెంగళూరు జాతీయ రహదారిపై తమిళనాడు సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం ఓ బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలతో సహా పలు వాహనాలు బూడిదయ్యాయి. 12 మంది కార్మికులు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిపల్లి వద్ద శనివారం సాయంత్రం నవీన్ అనే వ్యక్తికి చెందిన టపాసుల గోదాములోకి లారీల్లో వచ్చిన స్టాక్ను 20 మందికి పైగా సిబ్బంది అన్లోడ్ చేస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా ధాటికి చెలరేగిన మంటలు పక్క పక్కనే ఉన్న దుకాణాలకు, వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బాణాసంచాతో పాటుగా ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. దుకాణ యజమాని సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండులారీలతో పాలు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం 12 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా తమిళనాడు వాసులే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టపాసులను అన్లోడ్ చేసే సమయంలో విద్యుత్ తీగలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. -
నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం..13 మంది సజీవ దహనం
మాడ్రిడ్: స్పెయిన్లోని ముర్సియా నగరంలోని ఓ నైట్ క్లబ్లో సంభవించిన అగ్ని ప్రమా దంలో 13 మంది సజీవ దహనమ య్యారు. మరో నలుగురు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ప్రముఖ టియేటర్ నైట్ క్లబ్లో ఉదయం 6 గంటల సమయంలో మొదలైన మంటలు భవనమంతటా వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. లోపల మరికొంత మంది చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనం పైకప్పు కూలుతుందనే భయంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోతున్నారని చెప్పారు. -
పాక్లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
కరాచీ: మసీదుల్లో మిలాదునబి వేడుకలే లక్ష్యంగా పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఆత్మాహుతి దాడుల్లో 58 మంది మృత్యువాతపడగా మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు దాడిలో 54 మంది చనిపోయారు. మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో డీఎస్పీ నవాజ్ గషో్కరి కూడా ఉన్నారు. గుర్తు తెలియని దుండగుడు డీఎస్పీ నవాజ్ కారు పక్కనే నిలబడి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అదేవిధంగా, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ హంగు నగరంలోని దవోబా పోలీస్ ఠాణాలోకి అయిదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరో నలుగురు పారిపోయారు. వారిలో ఒకరు పక్కనే ఉన్న మసీదులోకి చేరుకుని తనను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో మసీదులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట సాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ దాడులకు తాము కారణం కాదంటూ తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ తెలిపింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన కీలక కమాండర్ను భద్రతా బలగాలు కాల్చి చంపిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐఎస్ పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
మణిపూర్ హింసాకాండలో 175 మంది బలి
ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు దహనమయ్యాయని తెలియజేసింది. మణిపూర్లో హింస మొదలైనప్పటి నుండి ఆయుధగారాల నుంచి 5,668 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వీటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు మళ్లీ స్వా«దీనం చేసుకున్నాయి. అల్లరి మూకల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, బాంబులను కూడా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గృహ దహనాలకు సంబంధించి పోలీసులు 5,172 కేసులు నమోదు చేశారు. హింసాకాండకు సంబంధించి మొత్తం 9,332 కేసులు నమోదు చేశారు. 325 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని మణిపూర్ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అస్సాం రైఫిల్స్ను ఉపసంహరించాలి తమ రాష్ట్రం నుంచి అస్సాం రైఫిల్స్ దళాలను వెంటనే ఉపసంహరించాలని మణిపూర్ పౌర సమాజ సంస్థలతో కూడిన మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ(కాకోమీ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. అస్సాం రైఫిల్స్ జవాన్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకోమీ ప్రతినిధులు తాజాగా ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. -
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
సూడాన్లో డ్రోన్ దాడి..43 మంది మృతి
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్లోని ఓ మార్కెట్పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 43 మంది చనిపోయారు. మరో 55 మంది గాయాలపాలయ్యారని మానవీయ సాయం అందిస్తున్న సంస్థలు వెల్లడించాయి. దేశంలో మిలటరీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నేత జనరల్ మహ్మద్ హమ్దాన్ దగాలో మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతంలో నివాసాల్లో పారా మిలటరీ బలగాలు తిష్టవేసి పోరాట సాగిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మిలటరీ వైమానిక దాడులకు దిగుతోంది. రెండు వర్గాల మధ్య పోరులో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ఈ పోరులో 4 వేల మందికి పైగా మరణించినట్లు ఐరాస చెబుతోంది. -
కాల్వలో పడిన ట్రాక్టర్.. 9 మంది మృతి
లక్నో: ట్రాక్టర్ ట్రాలీ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. తాజ్పురా ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది బుధవారం సాయంత్రం రన్దౌల్ గ్రామంలో జరిగే మతపరమైన కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. రెధిబోడ్కి గ్రామ సమీపంలోని కాల్వలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ పడిపోయింది. బుధవారం నాలుగు, గురువారం అయిదు మృతదేహాలను కాల్వ నుంచి బయటకు తీశారు. మృతుల్లో 5–12 ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు చిన్నారులు న్నారు. గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయని అధికారులు చెప్పారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
పెద్దంపేటలో ఈతవనం దహనం
‘జ్యోతిష్మతి’ విద్యార్థులతో వెబినార్
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఏఎంసీలో ధాన్యం చోరీ
మద్యం మత్తులో భార్యపై దాడి
పోలీసుల అదుపులో లక్కీ డ్రా నిర్వాహకులు
అట్టహాసంగా లయన్స్క్లబ్ మల్టికాన్
ప్రాణం తీసిన పాతకక్షలు
బీపీని నియంత్రిస్తేనే ఆరోగ్యం
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్కు ఈసీ నోటీసులు
Advertisement