12 గంటలు.. నరకయాతన

12 గంటలు.. నరకయాతన - Sakshi


ఇంటర్ సిటీ రైలు నుంచి పడిపోయిన యువకుడు

 చిన్నశంకరంపేట: ఇంటర్‌సిటీ రైలు నుంచి సోమవారం రాత్రి పడిపోయిన యువకుడు వైద్యం అందక 12 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి-వడియారం రైల్వేస్టేషన్‌ల మధ్య అటవీ ప్రాంతంలో జరిగింది. మల్కాజిగిరికి చెందిన పాటి శివకుమార్ బ్యాంకు పనిపై సోమవారం ఉదయం నిజామాబాద్ వెళ్లాడు. బ్యాంకులో పని కాకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మల్కాజిగిరికి బయలుదేరాడు.



రాత్రి మిర్జాపల్లి-వడియారం రైల్వేస్టేషన్ ల మధ్య కామారం రైల్వేగేట్ దాటిన తర్వాత రైల్లోంచి కిందపడిపోయాడు. కాగా, తనను ఎవరో తోసివేశారని యువకుడు చెబుతున్నాడు. రక్షించాలని అర్థించినా ఎవరూ పట్టించుకోలేదని ఆపై స్పృహ కోల్పోయానని తెలిపాడు. తర్వాత రోజు ఉదయం నీళ్ల కోసం అరుస్తుండగా అటుగా వెళ్తున్న రైల్వే కీమ్యాన్  గమనించాడు. రైల్వేట్రాక్ పక్కన పొదల్లో యువకుడి కదలికలు గమనించి.. మిర్జాపల్లి రైల్వేస్టేషన్  మాస్టార్‌కు సమాచారం అందించారు.



దీంతో ఆయన 108 అంబులెన్సకు సమాచారం అందించగా, వాహనం అక్కడి వరకు వెళ్లే పరిస్థితి లేదు. ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ లో వడియారం వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top