నవ్యాంధ్రకు ‘నవ’ వసంతం

నవ్యాంధ్రకు ‘నవ’ వసంతం - Sakshi


- పేదల కోసం తొమ్మిది సంక్షేమ పథకాలు

- ప్లీనరీ ముగింపులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటన

- ఊరూ వాడా చాటాలని కార్యకర్తలకు పిలుపు


- అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా..

- సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తాం

- కులం, మతం, పార్టీ, రాజకీయం చూడం

- అన్ని కుటుంబాల్లో ఆనందాలు నింపుతామని వెల్లడి


- జననేత పాదయాత్ర.. 3,000కి.మీ.. 6 నెలలు



వస్తున్నా.. ప్రతి ఇంటికి వస్తున్నా.. అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమల కొండ మీద దేవుడి దర్శనం చేసుకొని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తా.. – వైఎస్‌ జగన్‌



(వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): రుణమాఫీ కాక జీవితాలే మాఫీ అయిపోతున్న రైతులు.. బూటకపు వాగ్దానాలతో మోసపోయిన అక్కచెల్లెమ్మలు.. పెద్ద చదువులు దూరమైన పేద విద్యార్థులు.. బిడ్డలను చదివించుకోలేక తల్లడిల్లుతున్న తల్లులు.. ఆరోగ్యశ్రీ సహా అండగా ఉన్న సంక్షేమ పథకాలన్నీ అటకెక్కడంతో ఆందోళనపడుతున్న నిరుపేదలు.. మొత్తంగా మూడేళ్ల ప్రజాకంటక పాలనతో విసిగి వేసారిన బడుగు జీవులందరికీ ఓ భరోసా లభించింది.. ఓ ఆత్మీయ ఆసరా దొరికింది.. నవరత్నాల వంటి తొమ్మిది పథకాలతో నవ్యాంధ్రలో నవ వసంతానికి బాటలు పరచనున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.



అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలను అమలు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగాన్ని తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. కులాలకు, మతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని పార్టీ ప్లీనరీలో జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారు. హామీలను విస్మరించడంతో పాటు సంక్షేమ పథకాలన్నిటినీ అటకెక్కించిన చంద్రబాబు తీరును ఎండగట్టారు. ప్లీనరీలో ఒక్కొక్క పథకాన్ని ప్రకటిస్తుండగా ‘జై జగన్‌’ అంటూ పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా హర్షధ్వానాలు వెలిబుచ్చాయి. ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ముగింపు ఉపన్యాసం చేస్తూ రాబోయే రోజుల్లో తానేం చేయబోతున్నదీ, రాష్ట్ర ప్రజలకు ఎలా అండగా ఉండబోతున్నదీ జగన్‌ వివరించారు.



‘‘అన్న వస్తున్నాడు మంచి రోజులు రానున్నాయ్‌’’ అని ఊరూ వాడా చెప్పాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు.  కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకు నేలా రైతు భరోసా పథకాన్ని, డ్వాక్రా, పొదుపు సంఘాలకు తిరిగి జవసత్వాలు తీసుకువచ్చేలా వైస్సార్‌ ఆసరా పథకాన్ని, వేయి రూపాయల పింఛన్‌ను రెండు వేలకు పెంపు, ఒకటి నుంచి పది వరకు బిడ్డలను చదివించే తల్లులకు ఆర్థిక సాయం అందించేందుకు అమ్మఒడి పథకం, అందరికీ ఆరోగ్యం పంచేలా ఆరోగ్య శ్రీ,, పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివేందుకు ఉపకరించే మరింత మెరుగైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, సాగునీటి కోసం జలయజ్ఞం, మద్యపానాన్ని పారదోలేందుకు దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అంతేకాదు అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు జగన్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆరునెలల్లో 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ‘‘ప్రతి ఊరుకి పోండి.. ప్రతి గ్రామానికి వెళ్లండి.. త్వరలోనే అన్న వస్తున్నాడని చెప్పండి. అందరికీ భరోసా ఇస్తూ నేను కూడా వస్తా.. అక్టోబర్‌ 27 నుంచి దాదాపు ఆరు నెలల పాటు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ప్రతి జిల్లాకు, ప్రతి ప్రాంతానికి వస్తా.. మీతోనే ఉంటూ పాద యాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి తిరుమల కు వెళ్తా.. కాలి నడకన కొండెక్కి తిరుమలేశుడిని దర్శించుకుంటా. అక్కడి నుంచి ఇచ్ఛాపురం దాకా 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ఊరూ వాడా అందరికీ చెప్పండి. అన్న వస్తున్నా డు. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. వైఎస్‌ మాదిరిగానే అధికారం తెచ్చుకుంటాం. ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. నష్టపోయాం అని తెలుసు. కేసులు పెడుతున్నారనీ తెలుసు. మంచి కాలం వస్తుంది. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతా. మీ అందరి ఆశీస్సులు కోరుతున్నా’’ అని అన్నారు.



అన్ని వర్గాల కోసం నవరత్నాల్లాంటి పథకాలు



1. వైఎస్సార్‌ రైతు భరోసా

ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.50 వేలు ఇస్తాం. ఏటా మేలో నాలుగేళ్ల పాటు రూ.12,500 లను ఇస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి. (లబ్ధి పొందనున్న రైతు కుటుంబాలు: 66 లక్షలు)



2. వైఎస్సార్‌ ఆసరా

అక్కా చెల్లెమ్మల్లారా.. ఈ రోజు వరకు మీకున్న డ్వాక్రా రుణాలను అధికారంలోకి రాగానే పూర్తిగా మాఫీ చేసి 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం. అక్షరాలా 15 వేల కోట్లు మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే రుణాలిస్తాం. (లబ్ధి పొందనున్న డ్వాక్రా మహిళల సంఖ్య: 89 లక్షలు)



3. పింఛన్ల పెంపు

ప్రతి అవ్వాతాతకి, వికలాంగులకు ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్‌ రూ.1000 నుంచి 2000 పెంచి పక్కాగా అందిస్తాం. (లబ్ధిదారుల సంఖ్య: 45 లక్షలు)



4. అమ్మఒడి

పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లీ భయపడొద్దు. ఇంట్లో ఇద్దరి పిల్లలకు.. 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ. వెయ్యి, 6 నుంచి 10వ తరగతి దాకా రూ.1500, ఇంటర్‌ చదువులకు 2000 తల్లులకు అందిస్తాం. (లబ్ధి పొందనున్న విద్యార్థులు: 40 లక్షలు)



5. పేదలందరికీ ఇళ్లు

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం.  ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. డబ్బు అవసరమైతే ఇంటిని తనఖాపెట్టి పావలావడ్డీకే రుణం. (లబ్ధి పొందనున్న కుటుంబాలు: 25 లక్షలు)



6. ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం

ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తాం.  సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ కుటుంబం బతకడానికి డబ్బులు అందిస్తాం. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా పింఛన్‌. (లబ్ధి పొందనున్న కుటుంబాలు : 1.38 కోట్లు)



7. ఫీజు రీయింబర్స్‌మెంట్‌

పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20 వేలు అందిస్తాం. (లబ్ధి పొందనున్న విద్యార్థులు : 15.80 లక్షలు)



8. జలయజ్ఞం

దివంగత మహానేత వైఎస్‌ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడతాం.( అదనంగా  సాగు నీరు అందేది : 56 లక్షల ఎకరాలకు)

9. దశల వారీగా మద్య నిషేధం

కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. (రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనకరమే)



మద్య నిషేధం ఇలా..

అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యం ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడుతోంది. ఈ కారణంగా ఎన్ని జీవితాలు సర్వనాశనమవుతున్నాయో నాకు తెలుసు. రోడ్ల మీద జరిగే ప్రమాదాలే కాదు.  మద్యం కారణంగా లక్షల ఇళ్లల్లో మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మద్య నిషేధం అన్నది ఒక్కరోజులో అమలు సాధ్యం కాదు. ఈ వాస్తవం అర్ధం చేసుకోబట్టే మూడు దశల్లో ఈ పని చేస్తానని, అందరి కుటుంబాలకు వెలుగులు ఇస్తానని మాట ఇస్తున్నా.     –వైఎస్‌ జగన్‌



1. దుకాణాల సంఖ్య తగ్గించి అదే సమయంలో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతాం. మొదటి దశలోనే మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతాయన్నది సినిమా, టీవీల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తాం. మద్యం నిషేదం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలోనే మీడియాకు ఉంది. వారందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. మద్యం ధరలను షాకు కొట్టేలా పెంచుతాం.



2. మద్యం ధరలు పేద, మద్య తరగతి వారికి అందుబాటులో లేకుండా ఇంకా ఇంకా షాకు కొట్టేలా పెంచుతాం. మద్యం తాగితే కలిగే నష్టాలు, మద్యం తాగకుండా వచ్చేలాభాలను మరింత ఎక్కువగా మీడియా ద్వారా ప్రచారం చేస్తాం. ధూమ పాన వ్యతిరేక ప్రచారం మాదిరి మద్యపాన నిషేదించడానికి కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, ఉన్నత న్యాయస్థానాలు పూనుకునేలా వారిని ఒప్పించడానికి అడుగులు వేస్తాం. ప్రతి నియోజకవర్గంలో రీహాబిలిటేషన్‌ సెంటర్లు పెట్టి మద్యం మానుకోవడానికి ముందుకొచ్చే వారికి వైద్యం అందజేసి, వారికి తోడుగా నిలబెడతాం.



3. మద్యాన్ని కోటీశ్వర్లు మాత్రమే కొనుగొలు చేసేలా మద్యాన్ని ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే లభించేలా నియంత్రణ చేస్తాం. తాగి ఒకవేళ లివర్‌ చెడిపోతే ఏ అమెరికాకో వెళ్లి వైద్యం చేసుకునే స్థోమత ఉన్న వారికే మద్యం అందుబాటులోకి వస్తుంది. తాగి చెడిపోతే వాళ్లే చెడిపోతారు. మద్యాన్ని నియంత్రించేలా రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాలు తెస్తాం. మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేలా.. ఏడేళ్లు పాటు జైలుకు పోయేలా చట్టాలను మారుస్తాం. ఈ మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉండాలని చేస్తా ఉన్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top