జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్
Breaking News
బంగారానికి ఇక దుబాయే దిక్కు!
Published on Thu, 05/14/2026 - 05:30
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దుబాయ్ నుంచి పసిడి, వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) తెలిపింది. 2022లో 120 టన్నులతో మొదలైన కోటా 2027లో 200 టన్నులకు పెరగనుంది. ఇది భారత్ పసిడి దిగుమతుల్లో నాలుగో వంతుకు సమానం. కొత్త ఎంఎఫ్ఎన్ టారిఫ్ 15 శాతంగా ఉండగా, దుబాయ్ నుంచి దిగుమతులకి 14 శాతానికి పరిమితమవుతుందని జీటీఆర్ఐ పేర్కొంది. ఒక్క శాతం వ్యత్యాసం ప్రయోజనం పొందేందుకు దుబాయ్ మార్గం ద్వారా వ్యాపారులు పసిడిని మరింతగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వివరించింది.
సుంకాలు ఇలా ..
2012కి ముందు విలువతో సంబంధం లేకుండా 10 గ్రాములకు రూ. 300 చొప్పున సుంకం ఉండేది. 2012 జనవరిలో బంగారం విలువలో 2 శాతం కస్టమ్స్ సుంకం విధించారు. అదే ఏడాది మార్చిలో బడ్జెట్లో 4 శాతానికి పెంచారు.
2013లో రుపాయి మారకం, విదేశీ మారకం నిల్వలు పడిపోయిన కారణాలతో పసిడిపై దిగుమతి సుంకాలు మూడు సార్లు పెరిగాయి. మొదట 4 నుంచి 6 శాతానికి, తర్వాత 8 శాతానికి, ఆ పైన 10 శాతానికి పెరిగాయి.
2014–18 మధ్యకాలంలో 10 శాతమే అమల్లో ఉండగా, 2019లో దాన్ని 12.5 శాతానికి పెంచారు. 2021 బడ్జెట్లో 10.75 శాతానికి తగ్గించి, మళ్లీ 2022లో 15 శాతానికి పెంచారు. 2024లో దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 6 శాతానికి తగ్గించారు.
ప్రత్యామ్నాయాల్లేవా..?
2014లో మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువైన తర్వాత భౌతిక రూపంలో పసిడి దిగుమతులు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది అవేంటంటే..
ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నది ఈ పథకం లక్ష్యం. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఆ విలువపై 2.25–2.5 శాతం రాబడిని ఆఫర్ చేశారు. భౌతిక బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల ఆశించిన స్పందన రాలేదు. దీంతో 2025లో ఈ పథకాన్ని నిలిపివేశారు.
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)
భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సార్వభౌమ బంగారం బాండ్లకు శ్రీకారం చుట్టింది. 8 ఏళ్ల కాలవ్యవధి. బాండ్ కొనుగోలు ధరపై ఏటా 2.5 శాతం వడ్డీ ఎనిమిదేళ్ల పాటు రాబడిగా అందుతుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. 8 ఏళ్ల కాలవ్యవధి తర్వాత నుంచి బాండ్లు క్రమంగా మెచ్యూరిటీకి రావడం.. ఈ కాలంలో పసిడి ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం భారీగా పెగిపోయింది. పెట్టుబడిపై 150–200 శాతం అధికంగా చెల్లించాల్సి వచి్చంది. దీంతో 2025 నుంచి అనధికారికంగా ఈ పథకానికీ ప్రభుత్వం గుడ్బై చెప్పింది.
ఈటీఎఫ్లు
బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు), డిజిటల్ గోల్డ్ తదితర డిజిటల్ సాధనాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొనుగోలు విలువకు సరిపడా భౌతిక లోహాలను ఫండ్స్ సంస్థలు సమకూర్చుకుని ఖజానాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. కనుక ఒక రకంగా భౌతికంగా ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దేశీయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న బంగారాన్ని బ్యాకెండ్గా వినియోగించుకుంటే విదేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారం, వెండి డిజిటల్ రూపంలో ఉంటే కావాల్సినప్పడు విక్రయించి, కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. దీంతో చలామణి పెరుగుతుంది. పసిడిపై సుంకాల విధింపు దేశీయంగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకి సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tags : 1