త్వరలో అద్దాల బోగీలు
దేశంలో త్వరలో కొత్త తరహా రైల్వే బోగీలు రానున్నాయి.
తొలుత కశ్మీర్, అరకులో..
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త తరహా రైల్వే బోగీలు రానున్నాయి. రైలు ప్రయాణికులను, పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు బోగీ పైభాగాన్ని అద్దంతో తయారుచేయనున్నారు. స్విట్జర్లాండ్ తరహాలో ప్రకృతిని ఆస్వాదించేలా వీటిని రూపొందిస్తామని ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకే మనోచా సోమవారం చెప్పారు.
ఈ గ్లాస్–టాప్ బోగీలను భారత రైల్వే కేటరింగ్, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ), పరిశోధన, డిజైన్లు, ప్రమాణాల సంస్థ, పెరంబూరులోని కోచ్ ఫ్యాక్టరీ కలసి రూపొందిస్తాయన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి బోగీని కశ్మీర్లోయలో తిరిగే సాధారణ రైలుకు అమరుస్తామని, తర్వాత విశాఖపట్టణం–అరకు లోయలో తిరిగే రైలుకు అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. రూ.4 కోట్ల అంచనాతో చేస్తున్న ఈ బోగీలను ఏఏ రైళ్లకు అమర్చాలనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.


