ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు | Sakshi
Sakshi News home page

ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు

Published Sat, Sep 20 2014 3:00 AM

ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు - Sakshi

నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నుంచి ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులిడుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి  75,400 క్యూసెక్కుల నీరు వస్తోంది. అంతే మోతాదులో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవా రం ఉదయం 10గంటల వరకు నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్లద్వారా 25,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు దేవరకొండ ఉప్పా గు, డిండివాగు, నక్కలపెంట తదితర వాగులు, వంకలు, ఉపనదులు ఉప్పొంగుతుండగంతో సాగర్ జలాశయం నీటిమట్టం పెరిగింది.

దీంతో మరో రెండు గేట్లు ఎత్తి మొత్తంగా ఆరు గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. 215.8 టీఎం సీలు. కాగా ప్రస్తుతం 883.80 అడుగుల కు తగ్గించారు. 208.7210 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనుంచి 58,550 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుం డగా శుక్రవారం సాయంత్రం దిగువకు 57,287 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టంతో కొనసాగుతోంది. ప్రతి అర్ధగంటకోమారు నీటిమట్టాన్ని చూస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు.  
 
ఎడమకాలువకు నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేశారు. కాలువపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంలో గురువారం జరిగిన ప్రమాదంలో టర్బైన్లు  మునిగాయి. దీంతో విద్యుదుత్పాదక కేంద్రంలోని నీటిని తోడేందుకు గురువారం సాయంత్రం 4 గంటలనుంచి నీటి విడుదల నిలిపివేశారు. శనివారం ఉదయం వరకు అనుమతి తీసుకున్నట్లుగా సాగునీటిశాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టుకు నీటి అవసరాలు తగ్గాయి. దీంతో నీటిని నిలిపివేసినా ఇబ్బంది లేకుండా ఉంది.

విద్యుదుత్పాదక కేంద్రంలోని టర్బైన్‌లోకి వచ్చే నీటిని నిలిపివేయడానికి  అధికారులు, సిబ్బంది 24గంటలు  కృషిచేస్తున్నారు. అయినా ఆ నీరు ఆగడం లేదు.  గజ ఈతగాళ్లు నీటిలో మునిగి వేస్ట్‌కాటన్, రబ్బర్లు అడ్డుపెట్టినా నీరు ఆగడం లేదు. నీరు రావడం తగ్గితేనే ఎడమకాలువకు నీటిని విడుదల చేయడానికి వీలుంటుంది. ఒకవేళ నీటిని విడుదల చేస్తే కాలువలోని నీరు వెనుకకు వచ్చే అవకాశాలుంటాయి. టర్బైన్‌లోకి నీరు రాకుండా చేస్తే అప్పుడు తిరిగి రెండో యూనిట్‌లో విదుత్ ఉత్పాదన ప్రారంభమవుతుంది.
 
నాగార్జునసాగర్ : ఎడమకాలువపై విద్యుదుత్పాదన కేంద్రంలో నిలిచిపోయిన విద్యుదుత్పాదనను త్వరలో పునరుద్ధరిస్తామని రాష్ట్ర జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. శుక్రవారం ప్రమాదం జరిగిన విద్యుదుత్పాదక కేంద్రాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు. అధికారులు ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి నష్టమూ జరగలేదని తెలిపారు. కేవలం ప్రస్తుతం జరిగే విద్యుదుత్పత్తి నిలిచి పోయిందని తెలిపారు.

విద్యుదుత్పాదన జరిగే సమయంలో ఓవరాయిలింగ్ పనులేంటని విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వేసవిలోనే టెండర్లు పిలిచామని, ఈ యూనిట్‌లో ఉన్న టర్బైన్ బోవెన్ కంపెనీదని తెలిపారు. అయితే ఆ కంపెనీ కూడా ప్రస్తుతం లేకపోవడంతో పనిముట్లు దొరకక ఓవరాయిలింగ్‌కు ఆలస్యమైనట్లు చెప్పారు.

 
Advertisement
 
Advertisement