మాజీ ఎమ్మెల్యే ప్రచారంతో అన్నాడీఎంకేలో ఉత్సాహం
హొసూరు :హొసూరు మాజీ ఎమ్మెల్యే, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.ఏ. మనోహరన్ అన్నాడీఎంకే అభ్యర్థి పి.బాలక్రిష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో హొసూరులో అన్నాడీఎంకే పార్టీలో ఉత్సాహం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కే.ఏ.మనోహరన్కు కార్మికుల్లో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా హొసూరు నియోజకవర్గంలో మనోహరన్కు ప్రత్యేక వర్గం కూడా ఉంది. రాజకీయ చతురుడైన మనోహరన్ అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతు తెలిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాగలూరు, దిన్నపల్లి తదితర గ్రామాలలో కే.ఏ.మనోహరన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కే.ఏ.మనోహరన్ హొసూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేకిగా గతంలో ముద్ర ఉంది. కానీ అలాంటి బేషజాలకు తావులేక బాలకృష్ణారెడ్డికి మద్దతుగా మనోహరన్ ముమ్మర ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కే.ఏ.మనోహరన్, మాజీ ఎమ్మెల్యే టి. వెంకటరెడ్డిలు అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేయడంతో అన్నాడీఎంకే వర్గీయుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.