మేలో రాహుల్కు పట్టాభిషేకం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వీలైనంత ముందుగానే.. మే నెలలో తన తల్లి సోనియా గాంధీ నుంచి ఆ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశముంది. దీని కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సమావేశాలను ఎక్కడ నిర్వహించాలన్నదానిపై నేతలు చర్చిస్తున్నారు. ఢిల్లీలో కానీ, లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కానీ జరపాలని యోచిస్తున్నారు. సెలవులో ఉన్న రాహుల్ తిరిగి రాగానే పార్టీ అధ్యక్ష పదవి అంశం ఊపందుకుంటుందని చెబుతున్నారు.
రాహుల్ దీర్ఘకాలిక సెలవుపై చర్చ, సోనియా పార్టీ పగ్గాలను తన తనయుడికి అప్పగిస్తారన్న వార్తల నేపథ్యంలో.. కాంగ్రెస్ ఈ నెల 26న సంస్థాగత ఎన్నికల షెడ్యూలును ప్రకటించడం తెలిసిందే. షెడ్యూలు ప్రకారం.. పార్టీ చీఫ్ను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఎన్నుకోవాలి. రాహుల్ సెలవు ముగించుకుని వచ్చే నెలలో తిరిగి రావొచ్చని, అధ్యక్ష పదవి చేపట్టడంపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ ఈ పని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మేలని పేర్కొన్నారు. ఆయన ఒకవేళ అధ్యక్ష పగ్గాలు చేపడితే సోనియా ఇకముందూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా కొనసాగుతారని, పార్టీ పార్లమెంటరీ వ్యవహారాలపై దృష్టి పెడతారని వెల్లడించారు. 2013లో జైపూర్లో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ను ఉపాధ్యక్షుడిని చేయాలని నిర్ణయించడం, మరుసటి రోజు ఏఐసీసీ ఆ నిర్ణయాన్ని ఆమోదించడం తెలిసిందే.