ఇదే బీజేపీ సరికొత్త వ్యూహం?
► విభజించు.... పాలించు!
► ఇదే బీజేపీ సరికొత్త వ్యూహం?
► కాంగ్రెస్ను వీడేలా భూపీందర్ సింగ్ హూడాపై ఒత్తిడి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయం కోసం బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీనియర్లు పార్టీ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. హరియాణా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా బీజేపీ తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. హూడాపై ఉన్న కేసులను బూచిగా చూపుతూ.. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన తర్వాత బీజేపీలో కలవకుండా హూడాతో సొంతపార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని బీజేపీ∙వ్యూహం రచిస్తోందని తెలిసింది.
అటు హూడా క్యాంపులోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. హూడాను కాకుండా అశోక్ తన్వర్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించటంపైనా మండిపడుతున్నారు. ఇటీవల పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో హూడాతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ను వీడిన శంకర్ సింగ్ వాఘేలాను చేర్చుకోకుండా కొత్త పార్టీ నెలకొల్పేలా బీజేపీ వ్యూహరచన చేస్తోందని సమాచారం. ఇదే వ్యూహాన్ని హరియాణాలోనూ అమలు చేయాలనేది కమలదళం ఆలోచనగా కనబడుతోంది. యూపీఏ హయాంలో పౌరవిమానయాన మంత్రిగా ఉన్న ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్పైనా కేసులను బూచిగా చూపుతూ కేంద్రం ఒత్తిడి పెంచుతోందని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు