మహిళలకు రూ.2 లక్షల బీమా
ఫరిదాబాద్(హర్యానా) : మహిళలకు రూ.2 లక్షల బీమా వర్తింపచేస్తామని బీజేపీ నేత, ఫరిదాబాద్ ఎమ్మెల్యే విపుల్ గోయెల్ ప్రకటించారు. ప్రధాని మంత్రి సురక్ష యోజన పథకంలో భాగంగా మహిళల కోసం బీమా ప్రవేశపెడుతున్నట్లు రాఖీ పండుగ రోజు ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాఖీ వేడుకలను మురికివాడల్లో జరుపుకోవడం గమనార్హం.
ప్రేమ్ నగర్, సెక్టర్-8 త్రిమూర్తి ధర్మశాల, క్రిష్ణన్ కాలనీ మురికివాడల్లోని చిన్నారులు ఆయన చేతికి రాఖీ కట్టారు. పెన్షన్, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ మీటర్ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను తీర్చేందుకు అక్కడ సామాజిక క్యాంపు కార్యక్రమాలు నిర్వహిస్తామని గోయెల్ పేర్కొన్నారు. అన్నదమ్ముళ్లందరూ తమ అక్కాచెల్లెళ్లకు ఎప్పుడూ రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు.