అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి: పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీల అమలుకు సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, హైకోర్టు విభజన, తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ల హామీలు సత్వరమే అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 4వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు.
అందుకే, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్లను కల వాలని సుధాకరరెడ్డి కోరారు. అలాగే, మల్లన్న సాగర్ రిజర్వాయర్కు గ్రామసభల అంగీకారంతోనే భూసేకరణ జరపాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు.