అలిగితే అందలం
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్: అలగడమే లేటు... పదవితో పెదవి మూయించే కాంగ్రెస్ మార్క్ రాజకీయం జిల్లాలో మొదలైంది. అలిగిన నేతలకు అడిగినా...అడగకున్నా... పదవులు కట్టబెట్టడం ద్వారా బుజ్జగించే ప్రక్రియకు టీపీసీసీ తెరలేపింది. ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకుల అసంతృప్తిని చల్లార్చేందుకు, పార్టీకి వారివల్ల కలిగే నష్టాన్ని పూడ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు నడుం బిగించారు. సదరు నేతలను మచ్చిక చేసుకోవడానికి పదవుల బాణాన్ని సంధించారు. ఇటీవల వరుసగా టీపీసీసీ చేస్తున్న నియామకాలు ఈ కోటాలోనివేనని కాంగ్రెస్ వర్గాలే గుసగుసలాడుతుండటం విశేషం.
పార్టీ సీనియర్ నేత కటకం మృత్యుంజయం సిరిసిల్ల అసెంబ్లీ స్థా నం నుంచి పార్టీ టికెట్ ఆశించారు. మాజీ ఎమ్మెల్యేగా, పీసీసీ అధికార ప్రతి నిధిగా ఉన్న తనకు టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నప్పటికీ... డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావుకు టికెట్ దక్కింది. జిల్లాలో తనకంటూ వర్గాన్ని కలిగిన, వ్యూహరచనలో దిట్ట అయిన మృత్యుంజయం పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉండడం, ముఖ్యంగా సిరిసిల్లలో పార్టీ అభ్యర్థిపై ఎక్కువ ప్రభావం చూపించే పరిస్థితి ఉండటంతో ఆయనను బుజ్జగించే చర్యలకు పార్టీ నేతలు పూనుకున్నారు.
కొన్నేళ్లుగా ఆయన ఆశి స్తున్న డీసీసీ అధ్యక్ష బాధ్యతను అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగకుండా ఉండేం దుకే మృత్యుంజయంకు తాత్కాలికంగా పద వి ఇచ్చారని, ఎన్నికల తరువాత మారుస్తారేమోననే ప్రచారం అప్పుడే మొదలైంది. ఆయనకు పదవి ఇవ్వాలంటే పూర్తిస్థాయి అధ్యక్ష పదవి కట్టబెట్టే వా రని, ఇన్చార్జి అధ్యక్షుడిగా నియమిం చడం ఇందులో భాగమనే అనుమానా న్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నా రు. అసంతృప్తిని తగ్గించేందుకు మృ త్యుంజయంను డీసీసీ ఇన్చార్జి అధ్యక్షుడిగా నియమించగా, ఈ నియామకంపై కూడా ఆకారపు భాస్కర్రెడ్డి లాంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
నియోజకవర్గాల్లోనూ..
రామగుండం నుంచి వైశ్య సామాజిక వర్గం టికెట్ ఆశించినా ఆ వర్గానికి మొండిచేయి ఎదురైంది. కాంగ్రెస్కు అండగా ఉండే ఆ సామాజికవర్గం ఓట్లు పోకుండా చూసేందుకు, వైశ్య సామాజికవర్గానికి చెందిన గౌరిశెట్టి మునీందర్ను హఠాత్తుగా ఎన్నికల ప్రచార కమి టీ కన్వీనర్గా నియమించారు. ప్రచా రం ముగిసే నాలుగు రోజుల ముందు ఆయనకు పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలే విస్తుపోతున్నారు. కన్వీనర్ హోదాలో ఆయనేం చేయాలో తెలుసుకొనే సరికే గడువు ముగిసిపోనుంది. అసంతృప్తిని తగ్గించేందుకు ఏదో పదవి ఇచ్చామని చెప్పుకోవడానికే తప్ప కన్వీనర్గా నియమించి ఏం లాభమని పార్టీ నేతలు పెదవివిరుస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీచేసి, ఈ సారి టికెట్ ఆశించి భంగపడ్డ వకుళాభరణం కృష్ణమోహన్రావు కు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవి అ ప్పగించారు. టికెట్ కోసం తీవ్రంగా ప్ర యత్నించిన ఆయనకు టీపీసీసీలో చో టు కల్పించడం ద్వారా స్థానికంగా అ భ్యర్థికి అసమ్మతి లేకుండా చూసుకున్నా రు. ఇటీవల పార్టీలో చేరిన యువ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ముదుగంటి వి ష్ణువర్ధన్రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతిని ధి పదవి ఇచ్చి, ఆ వర్గాన్ని సంతృప్తి పరిచారు. మొత్తానికి పార్టీపై అలగడం తరువాయి పదవులు అప్పగించడం ద్వారా నష్టాన్ని పూడ్చేందుకు టీపీసీసీ పడుతున్న తంటాలు ఎన్నికల్లో ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.