AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
Published on Mon, 10/27/2025 - 11:56
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రంజీ ట్రోఫీలో (Ranji Trophy) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. 2025-26 ఎడిషన్లో భాగంగా చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 72 బంతుల్లోనే (13 ఫోర్ల సాయంతో) శతక్కొట్టాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన శతకం. తొలి ఐదు ఫాస్టెస్ట్ సెంచరీలు రిషబ్ పంత్ (48), రాజేశ్ బోరా (56), రియన్ పరాగ్ (56), రూబెన్ పాల్ (60), రజత్ పాటిదార్ (68) పేరిట ఉన్నాయి. రంజీ మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. షాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 14వ సెంచరీ.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్తో ప్రారంభించిన షా (కేరళపై).. రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు.
ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర, మూడో రోజు తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి, 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. షా 105, సిద్దేశ్ వీర 28 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
చదవండి: IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
Tags : 1