విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
Breaking News
‘పెద్ది’లో వాటిని గుర్తుపట్టలేరు.. నేనే షాకయ్యా : అవినాష్
Published on Thu, 05/07/2026 - 08:45
‘‘పెద్ది’ కథ విని షాక్ అయ్యాను. నా పదేళ్ల కెరీర్లో ఒక సినిమా కథకు ఇంతలా ఎగ్జైట్ కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ అంతలా నన్ను కదిలించింది’’ అని తెలిపారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ కొల్లా మాట్లాడుతూ– ‘‘విజయనగరం నేపథ్యంలో 1970–1980 కాలంలో జరిగే కథ ఇది. గతంలో కొన్ని పీరియాడికల్ సినిమాలకు పని చేసిన అనుభవం నాకు ఉంది. అది ‘పెద్ది’కి ఉపయోగపడింది. ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60–70 పైనే ఉంటాయి. విజయనగరం ఏరియాలోని క్లాక్ టవర్, అక్కడి వీధులు... వీటన్నింటిని రీ క్రియేట్ చేశాం.
విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డిజైన్ చేశాం. కుస్తీ సన్నివేశాల కోసం అండర్గ్రౌండ్ సెటప్ వేశాం. ఒక సినిమాకి సెట్ వేసినప్పుడు అది ప్రేక్షకులకు సెట్ అని తెలియకూడదు. నా వరకు ‘పెద్ది’ సినిమాకు వేసిన సెట్స్ను అవి సెట్స్ అని ప్రేక్షకులు గ్రహించలేరు.
ఈ సినిమాకి ఓ హిల్ స్టేషన్లా ఉండే ఊరు కావాలి. ఈ సెట్ను హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో వేశాం. ఈ సెట్ వేయడం సవాల్గా అనిపించింది. ప్రస్తుతం నానీగారి ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాను. అలాగే చిరంజీవి–బాబీగార్ల కాంబినేషన్లోని సినిమాకు వర్క్ చేస్తున్నాను’’ అని చెప్పారు.
Tags : 1