పాత ఓటమికి ప్రతీకారం? టీమిండియా ఫైనల్ పోరు
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Published on Fri, 03/06/2026 - 22:22
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే..
మల్లేష్(శ్రీనాథ్ మాగంటి) చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉంటుంది. దానికి కారణం వాళ్ల నాన్న. నాన్న తాగొచ్చ అతన్ని కొట్టడంతో.. ఓ రోజు మల్లేష్ కూడా మద్యం సేవించి నాన్నని కొట్టి పారిపోతాడు. కొన్నాళ్ల తర్వాత నాన్న చనిపోయిన విషయం తెలిసి తిరిగి వస్తాడు. ఊర్లోనే టెంట్ హౌస్ పెట్టి.. వచ్చిన డబ్బులతో తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అతని మేనమామ కొడుకు చిన్న పటేల్(రాజేష్)తో మల్లేష్ ఫ్యామిలీకి గొడవలు ఉంటాయి. తల్లి బలవంతం చేయడంతో జ్యోతి(గాయత్రీ రమణ)ని మల్లేష్ పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజే అతనికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? దాని వల్ల మల్లేష్కి వచ్చిన సమస్యలు ఏంటి? చిన్న పటేల్తో మల్లేష్ చేసిన ఛాలెంజ్ ఏంటి? జ్యోతి-మల్లేష్ల సంసారం ఎలా సాగింది? మందు లేనిదే ఏ పని చేయలేని మల్లేష్...చివరకు మద్యానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ కథలో కామాక్షి భాస్కర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ అడల్ట్ కామెడీ చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సింపులే అయినా.. దాని చుట్టు అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. అడల్ట్ కామెడీ అయినా.. అందులోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.
దారితప్పిన వ్యక్తిని తల్లి, భార్య ఎలా దారికి తీసుకొచ్చారు అనేది చూపిస్తూనే మద్యానికి బానిసైతే ‘సంసార’ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి.
మల్లేష్కు చిన్నప్పుడే తాగుడు అలవాటు ఎలా వచ్చింది అనే సన్నివేశాలతో కథను ప్రారంభించాడు దర్శకుడు. మొదటి పది నిమిషాలు రొటీన్గానే సాగిపోతుంది. మల్లేష్, జ్యోతిల పెళ్లి తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. కానీ ‘కార్యం’ మాత్రం కాదు. ఆ విషయం దాచేందుకు హీరో చేసే ప్రయత్నాలన్నీ నవ్వులు పూయిస్తాయి. మల్లేష్కి ‘కార్యం’ కాలేదనే విషయం చిన్నపటేల్కి తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు ఇద్దరు చేసుకునే సవాల్.. సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థం ప్రారంభంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది.
ఛాలెంజ్ గెలవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు.. దాన్ని తిప్పికొట్టేందుకు చిన్న పటేల్ చేసే కుట్రలు అన్ని రొటీన్గానే ఉంటాయి. తల్లి చనిపోయే సీన్ కూడా అనవసరమే అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో కామాక్షీ సీన్ అదిరిపోతుంది. అయితే ఆ తర్వాత ఆమె పాత్రను అంతే బలంగా చూపిస్తే బాగుండేది. కానీ దర్శకుడు మాత్రం భార్య భర్తల అనుబంధంపైనే ఫోకస్ చేశాడు. అవి ఆకట్టుకుంటాయి. అలాగే కార్యం సమయంలో పక్కింట్లోని ముసలాయన రేడియోలో వినే పాత పాటల సీన్లన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. రేడియో సీన్ రిపీట్ అయిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతాడు. కానీ కార్యం సీన్తో పాటు కొన్ని బూతు డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. క్లైమాక్స్ బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే..
ఇన్నాళ్లు తెరపై సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన శ్రీనాథ్.. ఇందులో ఊరమాస్ లుక్లో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్గా నటించిన గాయత్రి రమణ..తెరపై పక్కింటి తెలుగు అమ్మాయిలా కనిపించడమే కాకుండా నటన పరంగానూ మెప్పించింది. కామాక్షి భాస్కర్ల పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు కానీ.. ఒక్క సీన్లో మాత్రం అదరగొట్టేసింది. పటేల్గా రాజేశ్ బాగానే నటించాడు. మురళీ ధర్, రాజ్ కుమార్ కసిరెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సురేశ్ బొబ్బిలి నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టే, సాక్షి వెబ్డెస్క్
Tags : 1