Breaking News

ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?

Published on Fri, 06/13/2025 - 00:32

వచ్చే ఏడాది ఏప్రిల్‌ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్‌ యూనస్‌ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో,  ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్‌ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్‌ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్‌ నుంచి మయన్మార్‌లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్‌’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 

ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్‌ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్‌ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.

ఈ ఏడాదిలో జరగాల్సిందే!
అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్‌ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్‌ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. 

ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. 

ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్‌ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు.  ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. 

బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్‌ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. 

అవామీని దూరం చేయకూడదు!
ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్‌ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్‌’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. 

బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 

అవామీ లీగ్‌ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. 

అవామీ లీగ్‌ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్‌కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.

బలం పెంచుకుంటున్న జమాత్‌!
మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్‌ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్‌–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్‌కున్న రిజిస్ట్రేషన్‌ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్‌ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు’ జమాత్‌ నాయకుడు అజహరుల్‌ ఇస్లామ్‌ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. 

అప్పట్లో జమాత్‌ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్‌ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్‌ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్‌ డిమాండ్‌కు భారత్‌ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్‌ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. 

బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్‌ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్‌ చేస్తున్న డిమాండ్‌కు యూనస్‌ నిర్ణయించిన ఏప్రిల్‌ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది.  

అవామీ లీగ్‌ స్థాపకుడు, జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్‌ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్‌ అధినేత షఫీకుర్‌ రహమాన్‌ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్‌తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్‌ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.

నిరుపమా సుబ్రమణియన్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)