రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం
Breaking News
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
Published on Tue, 12/09/2025 - 21:28
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 10, 2025 నుంచి అమలులోకి రానుంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ (సోషల్ మీడియా మినిమం ఏజ్) బిల్లు’ ను 2024 నవంబర్లో ఆమోదించింది. ఈ చట్టం ఆన్లైన్ సేఫ్టీ చట్టం 2021 (Online Safety Act 2021)కు సవరణగా ఉంది.
ఈ నియమంలోని కీలక అంశాలు ఏమిటి?
ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పిల్లలపై కాకుండా సోషల్ మీడియా సంస్థలపై బాధ్యతను మోపుతుందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని నిర్దిష్ట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా నిరోధించడానికి సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.
తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా కూడా 16 ఏళ్ల లోపు వారు ఈ ప్లాట్ఫామ్లను ఉపయోగించడానికి అనుమతి లేదు.
ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించే ప్రధాన ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్, టిక్టాక్, ఎక్స్, రెడ్డిట్, థ్రెడ్స్, ట్విచ్, కిక్.
ప్రధానంగా మెసేజింగ్ లేదా గేమింగ్ కోసం ఉపయోగించే WhatsApp, Discord, Roblox వంటి సర్వీసులను ప్రస్తుతానికి మినహాయించారు. అయినప్పటికీ, సేఫ్టీ కమీషనర్ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఈ జాబితాను మార్చే అవకాశం ఉంది.
ప్లాట్ఫామ్లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలు చేయనున్నారు.
సంస్థలు వయస్సు ధ్రువీకరణ కోసం ప్రభుత్వ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా కోరకూడదు. అయితే ఫొటో లేదా వీడియో ఆధారిత వయస్సు అంచనా లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించే అవకాశం ఉంది.
అనుసరించకపోతే జరిమానాలు
ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.270 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానాలు ఉండవు. ఈ చట్టం బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపై మాత్రమే ఉంటుంది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న తీవ్ర ఆందోళనలే కారణం. సోషల్ మీడియా అధిక వినియోగంతో కౌమార దశలో ఉన్నవారిలో ఆందోళన, నిరాశ, ఒంటరితనం పెరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. నిరంతర పోలికలు, లైక్ల కోసం ఎదురుచూడటం, సైబర్బుల్లింగ్ (Cyberbullying-డిజిటల్ వేదికల ద్వారా ఇతరులను అవమానించడం, బెదిరించడం, వేధించడం లేదా హింసించడం) వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రమాదకరమైన కంటెంట్
ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ‘ప్రెడేటరీ అల్గారిథమ్స్’ కారణంగా పిల్లలు హింస, ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు, అసభ్యకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం వంటి ప్రమాదకరమైన కంటెంట్ బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ దీన్ని ‘బిహేవియరల్ కొకైన్’తో పోల్చారు.
సోషల్ మీడియా వేదికలు పిల్లల మధ్య తోటివారి ఒత్తిడికి, ఆన్లైన్ వేధింపులకు వాహకంగా మారుతున్నాయి. మోసగాళ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి సులువైన మార్గాలుగా మారుతున్నాయి.
సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లలు చదువు, నిద్ర, ఆటలు వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు దూరం అవుతున్నారు.
కంపెనీలపై ప్రభావం ఇలా..
ఈ నియమం వల్ల సోషల్ మీడియా కంపెనీలు ముఖ్యంగా ఆదాయం, మార్కెట్ పరిమాణం పరంగా నష్టాలను ఎదుర్కొంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న వినియోగదారులను తొలగించడం లేదా వారిని చేర్చుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో మొత్తం యూజర్ బేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ వయస్సు సమూహం తరచుగా అత్యంత చురుకైన వినియోగదారులలో ఒకటిగా ఉంటుంది.
ప్రకటనల ఆదాయంపై ప్రభావం
సోషల్ మీడియా కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. యూజర్ల సంఖ్య తగ్గితే ప్రకటనలను చేరుకునే అవకాశం ఉన్న జనాభా (Ad Reach) కూడా తగ్గుతుంది. ఫలితంగా ప్రకటనదారులకు ప్లాట్ఫామ్ ఆకర్షణ తగ్గి ప్రకటనల ఆదాయం తగ్గుతుంది.
నియంత్రణ అమలు ఖర్చులు
వయస్సు ధ్రువీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని అమలు చేయడానికి టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాలి. ఈ కొత్త సాంకేతికతలను కొనసాగించడం, డేటా భద్రతను నిర్ధారించడం, స్థానిక చట్టాలను నిరంతరం పర్యవేక్షించడం అనేది అదనపు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది.
సాంకేతిక సవాళ్లు
వయస్సు ధ్రువీకరణ అనేది సాంకేతికంగా చాలా క్లిష్టమైన విషయం. కొన్ని పద్ధతులు (ముఖ ధ్రువీకరణ వంటివి) గోప్యత సమస్యలను పెంచుతాయి. ఏఐ ఆధారిత వయస్సు అంచనా (AI-based Age Estimation) వంటి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సవాళ్లు ఎదురుకావొచ్చు. అందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. వయస్సు ధ్రువీకరణ కోసం వినియోగదారుల నుంచి అదనపు వ్యక్తిగత సమాచారం సేకరించాల్సి వస్తుంది. దీని వల్ల డేటా ఉల్లంఘనలు, ప్రైవసీ ఉల్లంఘనల ప్రమాదం పెరుగుతుంది. ప్లాట్ఫామ్లు తమ కంటెంట్ సిఫార్సు అల్గారిథమ్లను మార్చాలి. తద్వారా 16 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే సరియైన కంటెంట్ చేరుకునేలా చూసుకోవాలి.
ఇదీ చదవండి: క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే..
Tags : 1