జట్టుకు ఎంపిక చేయమన్న రిషి సునాక్‌: ఇప్పుడే కుదరదన్న ఈసీబీ! | UK PM Rishi Sunak announced a GBP 35 million investment in cricket across England and Wales. - Sakshi
Sakshi News home page

తనను జట్టుకు ఎంపిక చేయమన్న రిషి సునాక్‌: ఇప్పుడే కుదరదన్న ఈసీబీ!

Published Sat, Apr 6 2024 12:06 PM

UK PM Rishi Sunak Plays Cricket With England Team Faces Anderson - Sakshi

యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్‌ మరోసారి ఇంగ్లండ్‌ క్రికెటర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు.  దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో తన బ్యాటింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శించారు.

కాగా క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాని రిషి సునాక్‌ 35 మిలియన్‌ బ్రిటిష్‌ పౌండ్ల(GBP-  British pound sterling ) ప్యాకేజీని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌ పట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రోత్సాహం అందించేందుకు ఈ భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 

దాదాపు తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రణాళికలు రచించినట్లు రిషి సునాక్‌ వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని ప్రకటించే క్రమంలో లండన్‌లో ఆయన.. ఇంగ్లండ్‌ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లను కలిశారు.

ఈ సందర్భంగా.. ఆండర్సన్‌తో ఫ్యాన్‌ బాయ్‌ మూమెంట్‌ను సునాక్‌ షేర్‌ చేసుకోవడం ఆయన హుందాతనానికి నిదర్శనంగా నిలిచింది. అదే విధంగా.. యువ క్రికెటర్లను సైతం ఉత్సాహరుస్తూ వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు సునాక్‌. 

కాగా ఆండర్సన్‌ను ఎదుర్కొనేందుకు తాను ముందుగానే నెట్‌ సెషన్‌లో పాల్గొన్నానంటూ రిషి సునాక్‌ వెల్లడించడం విశేషం. ఇందుకు బదులిచ్చిన ఆండర్సన్‌ ఆయన అభిమానానికి ఫిదా అయ్యాడు. ఇక ఈ విశేషాలకు సంబంధించిన వీడియో షేర్‌ చేసిన రిషి సునాక్‌.. ‘‘ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పిలుపునకు సిద్ధంగా ఉన్నా’’ అని తన సెలక్షన్‌ గురించి ఈసీబీకి సరదాగా రిక్వెస్ట్‌ పెట్టారు.

ఇందుకు బదులిచ్చిన ఈసీబీ.. ‘‘బాగానే ఆడారు. కాకపోతే మీరు ఇంకొన్ని నెట్‌ సెషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని అంతే సరదాగా స్పందించింది. కాగా 2026లో మహిళా టీ20 ప్రపంచకప్‌, 2030లో పురుషుల టీ20 వరల్డ్‌కప్‌నకు ఇంగ్లండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈసీబీకి మరింత బూస్ట్‌ ఇచ్చేలా ప్రధాని రిషి సునాక్‌ ఈమేరకు ప్యాకేజీ ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆండర్సన్‌ సహా పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement