Sachin pilot not to float a separate political party clarifies Congress party - Sakshi
Sakshi News home page

సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ.. 

Published Sat, Jun 10 2023 7:58 AM

Congress Clarifies On Sachin Pilot New Party Rumours  - Sakshi

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపధ్యంలో వారి మధ్య చర్చలు నిర్వహించి సమన్వయము కుదిర్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు. అయినా కూడా సమస్య పరిష్కారం కాని కారణంగా సచిన్ పైలట్ వేరుకుంపటి పెట్టనున్నారని ఈ మేరకు తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగి సచిన్ పైలట్ కొత్త పార్టీ పుకార్లను కొట్టి పారేశారు. అవన్నీ సత్యదూరమైన ప్రచారాలని తేల్చి చెప్పారు.    

కలిసే ఉన్నాం.. కలిసే పోటీ చేస్తాం.. 
త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉండి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని అన్నారు కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్. ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  " నేను ఈ పుకార్లను నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అశోక్  గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరితో జరిపిన చర్చల్లో మనం కలిసే పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు వారిద్దరూ సానుకూలంగా స్పందించారు. నాకు తెలిసి సచిన్ కొత్త పార్టీ అనేది పూర్తిగా అవాస్తవం. మా పార్టీ ఐక్యంగానే ఉంది మేము వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని కరాఖండిగా తేల్చిచెప్పారు. 

సచిన్ అసంతృప్తి.. 
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సచిన్ పైలట్ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి అంశాలతో పాటు పేపర్ లీకేజీ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పునర్వ్యవస్థీకరణ అంశాలపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ అంశాలనే అదనుగా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయని సచిన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని వదంతులు పుట్టుకొచ్చాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు.  

ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. 
 

Advertisement
Advertisement