విద్యా సంస్కరణలకు అద్దంపట్టేలా రాష్ట్ర శకటం

Andhra pradesh government to prepared for Republic Day: New Delhi Parade - Sakshi

గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సిద్ధం చేసిన సమాచార పౌరసంబంధాల శాఖ

సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భాగంగా జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన  సంస్కరణలకు అద్దంపట్టేలా ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం’’ అనే ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్‌ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేస్తోందని, తద్వారా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి వివరించింది.

ఇప్పటికే 62 వేల డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్‌ ల్యాబ్, ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, స్మార్ట్‌ టీవీ, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, ప్లే గ్రౌండ్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ అంశాన్ని అందరినీ ఆకట్టుకునేలా శకటంలో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి 55 సెకెన్ల నిడివిగల థీమ్‌ సాంగ్‌ రూపొందించామని, శకటం పరేడ్‌లో ప్రదర్శనకు సిద్ధమైందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ  ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top