-
ఒకే కుటుంబం.. కేంద్రాలనేకం!
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు.అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతో పాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలాఎందుకవుతుందో అంతుపట్టడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం! -
ఉపాధి పనులు చేస్తూ కూలీ మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, తోటి కూలీలు నవాబుపేట: తనతో పాటు రోజూ పనిచేసే భర్త అకస్మాత్తుగా విగతజీవిగా మారడంతో ఆ భార్య గుండెలవిసేలా రోదించింది. ఈ విషాద సంఘటన కడ్చర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసుల లక్ష్మయ్య(55) వ్యవసాయ కూలీ. రోజు మాదిరిగానే భార్య కిష్టమ్మతో కలిసి ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. అక్కడ పనులు చేస్త్తూనే అకస్మాత్తుగా కింద పడిపోయాడు. భార్య, తోటి కూలీలు లేపడానికి ప్రయత్నించగా ఆయన విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుండె పోటు వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి భార్య కిష్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భరత్ భూషణ్ తెలిపారు. -
వరకట్నం వేధింపులకు వివాహిత బలి
పరిగి: అదనపు వరకట్నం కోసం భర్త, అత్తమామ పెట్టిన వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మండలంలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జైనబేగం, గౌస్ దంపతుల పెద్ద కుమార్తె షహీన్బేగం(24)ను పూడూర్ మండలం గొంగుపల్లి గ్రామానికి చెందిన రఫీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు. ఆ సమయంలో పెద్దల సమక్షంలో రూ.16 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయించారు. కానీ పెళ్లయిన మరుసటి నెల నుంచి భర్త, అత్తమామ, ఆడపడుచు నిత్యం అదనపు కట్నం కోసం మానసికంగా, శరీరకంగా వేధింపులకు గురిచేశారు. వీటిని భరించలేక షహీన్బేగం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మాట్లాడాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఈనెల 12న షహీన్బేగంను భర్త తల్లిగారి ఇంట్లో వదిలి వెళ్లాడు. దీంతో మానసికంగా బాధపడుతూ ఆమె మంగళవారం రాత్రి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి జైనబేగం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.నస్కల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం -
గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్కుమార్
షాద్నగర్: బీజేపీ గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా షాద్నగర్కు చెందిన జటావత్ వినోద్కుమార్ను బుధవారం పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చైతన్య పరుస్తానని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అఖండ మెజార్టీ అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళాతానన్నారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం జిల్లాస్థాయి పదవి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహ్మారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
సివిల్స్లో గిరి పుత్రుడి సత్తా
షాద్నగర్: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వాసి సత్తా చాటాడు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 891వ ర్యాంకుతో మెరిశాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిఽధిలో చాకలిదాని తండాకు చెందిన రాములు నాయక్, సీతమ్మ దంపతుల పెద్దకుమారుడు శశికాంత్. తండ్రి రాములు నాయక్ హాస్టల్లో వార్డెన్గా పని చేస్తూ షాద్నగర్ పట్టణంలోని విజయ్నగర్ కాలనీలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఆయన 2008లో అకస్మాత్తుగా మృతి చెందడంతో అప్పటి నుంచి తల్లి పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శశికాంత్ షాద్నగర్ పట్టణంలోని మరియారాణి ఉన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నాగర్కర్నూల్ జిల్లా వట్టెం నవోదయలో 9, 10వ తరగతులు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్లోని మియాపూర్ గుంటూరు వికాస్లో ఇంటర్, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(ఈఈఈ) పూర్తి చేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన శశికాంత్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వాటిని వదలుకున్నారు. 2011లో ఇన్ఫోసిస్లో ఏడాదికి రూ.11లక్షల ప్యాకేజీతో, 2012లో పశ్చిమ బెంగాల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఏటా రూ.12లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయినా వాటిల్లో చేరకుండా సివిల్స్ వైపు దృష్టి మళ్లించారు. 2013లో ఢిల్లీ వెళ్లి సివిల్స్కు సిద్ధం అయ్యారు. మూడుసార్లు ప్రిలిమినరీ వరకు వచ్చారు. 2019లో కేవలం 6 మార్కుల తేడాతో అవకాశం కోల్పోయారు. 2020లో ఆరో ప్రయత్నంలో సివిల్స్లో 695 ర్యాంకు సాధించిన శశికాంత్ను యూపీఎస్సీ అధికారులు ఐఆర్టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)కు కేటాయించారు. ప్రస్తుతం అస్సాంలో రైల్వేశాఖలో పని చేస్తున్నారు.షాద్నగర్వాసికి 891వ ర్యాంకు అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగం సాధించాలని ఎందరో కలలు కంటారు. దానికి నిర్దిష్టమైన ప్రణాళిక రచించి, కఠోర సాధన చేస్తే తప్ప దాన్ని అందుకోవడం సాధ్యం కాదు. అలాంటి కలను షాద్నగర్వాసి సాకారం చేసుకున్నాడు. ఇటీవల వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు.చదువుతూ.. ఉద్యోగం చేస్తూ అస్సాం రాష్ట్రంలోని రింగియా డివిజన్లో రైల్వే విభాగంలో అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్గా శశికాంత్ విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తూనే మరోసారి సివిల్స్కు ప్రయత్నించారు. ఇప్పటి వరకు 8సార్లు పరీక్షలు రాసిన శశికాంత్ మూడు సార్లు ర్యాంకులు సాధించారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ సర్వీసెస్ తుది పరీక్ష ఫలితాలు మంగళవారం వెల్లడించింది. మొత్తం 1,016 మందిని ఎంపిక చేయగా శశికాంత్ 891వ ర్యాంకు సాధించి శెభాష్ అనిపించుకున్నారు. -
పేదింటి బిడ్డకు పెద్ద కొలువు
పూడూరు: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అనే నానుడిని నిజం చేశాడా ఆ యువకుడు. కష్టాల కడలిని ఈదుతూనే సివిల్స్కి సన్నద్ధమయ్యాడు. ఫలితంగా ఓ వ్యవసాయ కూలీ కుమారుడు ఐఏఎస్కు ఎంపికయ్యాడు. ప్రతిభ ఎవరి సొంతం కాదని నిరూపించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు తరుణ్. యూపీఎస్సీ వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో 231 ర్యాంకుతో మెరిశాడు. వ్యవసాయ కూలీలు పూడూరు మండలం మంచన్పల్లి గ్రామానికి చెందిన దయ్యాల బాబయ్య, శశికళ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు తరుణ్ ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తరుణ్ను చదివించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. 2023లో సివిల్ సర్వీస్ మెయిన్స్లో ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. నాయకుల ప్రశంసలు సివిల్స్లో విజయం సాధించిన తరుణ్ తల్లిదండ్రుల సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. తమ బిడ్డకు అత్యున్నత ఉద్యోగం రావడంతో తమ కష్టాలు తీరిపోతాయని సంబురాలు చేసుకుంటున్నారు. సివిల్స్ ఫలితాల్లో జిల్లాకు చెందిన యువకుడి ఎంపిక కావడంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డితో పాటు మండల పరిధిలోని యువజన సంఘాల నాయకులు సన్మానించారు. మారు మూల గ్రామానికి చెందిన యువకుడు ఐఏఎస్కు ఎంపికకావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఎనిమిదో తరగతి చదువుతుండగా ఐపీఎస్ ప్రవీణ్కుమార్ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని కోరిక పుట్టింది. అప్పటి నుంచి బీటెక్ పూర్తి అయిన తర్వాత బాబాయి, స్నేహితుల సహకారంతో ప్రిపరేషన్ మొదలు పెట్టాను. చిన్నప్పటి నుంచి కడు పేదరికంలో మగ్గాను. ఉన్నతంగా చదివి కుటుంబానికి వెలుగులు తెద్దామని కష్టపడి చదివాను. సివిల్స్లో విజయం సాధించడానికి రోజుకు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ చేశాను. స్నేహితులు, బంధువుల సహకారంతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రిపేర్ అయ్యాను. ఎక్కువగా యూట్యూబ్లో పాఠాలు విని నేర్చుకున్నాను. తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావొద్దని సొంతంగా పరీక్షలకు సిద్ధం అయ్యాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది.ఆర్ఎస్పీ ఆదర్శంసివిల్స్ ఫలితాల్లో ఐఏఎస్కు ఎంపికై న తరుణ్ మొదటి ప్రయత్నంలోనే విజయం వ్యవసాయ కూలీ కుమారుడికి ఉన్నతోద్యోగం -
అటకెక్కికిన ‘బృహత్’
వికారాబాద్: బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అటకెక్కినట్లు కన్పిస్తోంది. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు వాటి ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినప్పటికీ అవి ముందుకు సాగడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలు, అర్బన్ పార్కుల పేరుతో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమానికి తోడు మండలానికొకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంవీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసినప్పటికీ యంత్రాంగం వీటి ఏర్పాటుపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. సమన్వయలోపం... బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ యంత్రాంగం చూడగా.. ప్రకృతి వనాల అభివృద్ధి బాధ్యతలు మండల పరిషత్, ఉపాధి హామీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏ మొక్కలు నాటాలి, ఎన్ని నాటాలి తదితర వాటిని ఫారెస్టు అధికారులు పర్యవేక్షిస్తారు. పచ్చదనాన్ని పెంచటంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా వనాల్లో కుర్చీలు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొదటి ఏడాది మొక్కలు నాటడం..వాటి పెంపకం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని, రెండవ ఏడాది నుంచి వనాలను అభివృద్ధి చేయటం, వాటిలో వసతులు కల్పించటం లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే శాఖల మధ్య సమన్వయలోపంతోనే ఇప్పటికీ పనులు ప్రారంభం కావడంలేదనే విమర్శలున్నాయి. మండలానికొకటి చొప్పున.. జిల్లాలో మండలానికొకటి చొప్పున మొత్తం 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలాల లభ్యతను బట్టి మండల కేంద్రాలకు సమీపంలో లేదంటే మండలంలో ఏదో ఒకచోట ఈ వనాలకు స్థలాలను కేటాయిస్తారు. ఒక్కో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 8 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వనంలో సగటున 33వేల చొప్పున మొక్కలు నాటనున్నారు. కాగా ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీకి ఒకటి చొప్పున జిల్లాలో నాలుగు అర్బన్ పార్కుల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అలాగే గ్రామానికొకటి చొప్పున జిల్లాలో మొత్తం 715 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా త్వరగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక ఏడాది క్రితమే స్థలాల కేటాయింపు పూర్తి శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో తీవ్ర జాప్యం అందుబాటులోకి తేవాలంటున్న ప్రజలు పనులు ప్రారంభించాలి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాలు సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి. పల్లె ప్రకృతి వనాల తరహాలోనే బృహత్ ప్రకృతి వనాలు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. – విజయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
కుల్కచర్ల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన కుల్కచర్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వీరాపూర్ గ్రామానికి చెందిన రెబ్బనమోని శ్రీనయ్య(37) అప్పుల బాధ తాళలేక ఈనెల 14న పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని పాలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆలయానికి పల్లకి అందజేత కేశంపేట: మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం సభ్యులు 40వేల విలువ గల పల్లకిని బుధవారం అందజేశారు. గ్రామంలో నిర్వహించే పల్లకి సేవలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అందజేసినట్లు వారు తెలిపారు. దైవకార్యాలకు ఉపయోగపడే పల్లకీ అందజేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు విఘ్నేశ్, రాఘవేందర్, శేఖరయ్య, శ్రీనివాసులు, కృష్ణయ్య, శంకరయ్య, శేఖర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత రూ.7.50 లక్షల విలువ ఉంటుందని పోలీసుల వెల్లడి షాద్నగర్రూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం సాయంత్రం ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి డీసీఎం వాహనంలో 26.2 టన్నుల రేషన్ బియ్యాన్ని నారాయణపేట జిల్లా మరికల్కు తీసుకెళుతున్నారు. ముందస్తు సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ, షాద్నగర్ పోలీసులు మంగళవారం పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద మాటు వేసి పట్టుకున్నారు. రేషన్ బియ్యంతో పాటుగా డీసీఎంని పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. బియ్యం విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఫరూఖ్నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలోని మొల్లోనిగడ్డ తండాకు చెందిన పాత్లావత్ కిషన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు డీఐ రామిరెడ్డి తెలిపారు.ముగిసిన బీరప్ప ఉత్సవాలు మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవాలు బుధవారం మహా మంగళ హారతితో ముగిశాయి. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ స్వప్నఅంజయ్యగౌడ్, బీరప్ప సంఘం నాయకుడు రవి దంపతులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నక్కలపల్లి గ్రామంలో బీరప్ప ఉత్సవాలను అందరూ కలిసి వైభవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి ఉత్సవాలు ప్రతి యేటా జరుపుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకు మరమ్మతులు కొందుర్గు: కంకల్ రోడ్డు నుంచి తుమ్మలపల్లి గ్రామం వరకు రోడ్డుకిరువైపులా మరమ్మతు పనులు చేపట్టారు. రోడ్డు పక్కన గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని గమనించిన తుమ్మలపల్లి గ్రామస్తులు అబ్దుల్ అజీజ్, బంగారు రాములు, వడ్ల బ్రహ్మయ్య, మాణిక్యారావు ట్రాక్టర్ల యజమానులతో మాట్లాడి అందరు కలిసి మూడు కిలోమీటర్ల పొడవు రోడ్డు బాగుచేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని అభినందించారు. -
యువతి అదృశ్యం
మొయినాబాద్: ఆరుబయట బాత్రూంకు వెళ్లిన వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం, రాఘవరెడ్డి కాలనీకి చెందిన అతిపాటి ఆదిశేషయ్య కొంత కాలంగా మండల పరిధిలోని చిన్నషాపూర్గేటు సమీపంలో ఉంటున్నాడు. అతని సోదరుడి కూతురు లావణ్య(18) పది రోజుల క్రితం ఆదిశేషయ్య ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం బాత్రూంకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా రాఘవరెడ్డి కాలనీకి చెందిన ప్రసాద్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి షాద్నగర్రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన సిద్ధార్ధ తుకారాం కడేకర్(24) కుటుంబంతో కలిసి గత కొంత కాలం క్రితం షాద్నగర్కు వలస వచ్చారు. గ్రామంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో సిద్ధార్ధ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. బుధవారం నీటి ట్యాంకులో ఆయన పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏఎస్ఐ రాంచందర్ ఘటనా స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. చేపలు పట్టే విషయంలో ఘర్షణ యాచారం: చెరువులో చేపలు పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణచోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తక్కళ్లపల్లి–తక్కళ్లపల్లి తండా గ్రామాల మధ్యన ఉన్న చెన్నరెడ్డిచెరువులో మంగళవారం రాత్రి తండాకు చెందిన కొంత మంది చేపలు పట్టడానికి వెళ్లారు. ఇది గమనించిన తక్కళ్లపల్లి గ్రామస్తులు చేపలు పట్టే వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. -
సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు
మొయినాబాద్రూరల్: ప్రస్తుత కాలంలో సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని చెతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ పురుషోత్తమ్రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేట్ అధికారి సాత్వికరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామ సమీపంలో గల యూనివర్సిటీలో భార్గవి, ప్రశాంత్రాజాలు డాక్టరేట్ పొందారు. సుక్ష్మ జీవశాస్త్ర విభాగంలో ‘ఎవాల్యూవేషన్ ఆఫ్ యాంటీ బ్యాక్టిరియా ఎన్డీ యాంటీ బయోఫిల్మి పోటేన్షియల్ ఆఫ్ సెలెక్టేడ్ ప్లాంటీ ఎక్స్లెన్స్ ఎగ్రినేస్ట్ డిగ్రీ రెసిస్టెంట్ పాతోజేన్స్’ అనే అంశంపై ప్రొఫెసర్ బి.శ్రీలత పర్యవేక్షణలో భార్గవి పరిశోధన చేశారు. అదే విధంగా రసాయన శాస్త్ర విభాగంలో ‘సిందాసిస్ అండ్ బయోలాజికల్ ఎలివేషన్ ఆఫ్ నైట్రోజన్ బెస్ట్ ఎటేరో సక్లిస్ట్’ అనే అంశంపై ప్రొఫెసర్ జగదీష్కుమార్ పర్యవేక్షణలో ప్రశాంత్రాజ్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా వీరికి డాక్టరేట్ పట్టాను అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రవీందర్, కవిత, రిసర్చ్ డీన్ కిష్టఫర్, డిన్ సైన్స్ ప్రొఫెసర్ సుందర్రామ్, అడ్మినిస్ట్రేషన్ రాజు, పబ్లిక్ రిలేషన్ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీచాన్స్లర్ డాక్టర్ పురుషోత్తమ్రెడ్డి -
స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మర్పల్లి: ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం కృష్ణయాదవ్ గృహప్రవేశం కార్యక్రమం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లడుతూ.. ప్రతిఒక్కరూ ఒక స్థితికి చేరుకున్న తర్వాత సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శ్రీనివాస్ యాదవ్ పేదరికం నుంచి స్వశక్తితో ఎదిగి నేడు సొంత ఇల్లునిర్మించుకోవడం అభినందనీయం అన్నారు. సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్కుమార్, ఉపాధ్యక్షుడు ఫసీయుద్దీన్, కాంగ్రెస్ నాయకులు రాములు యాదవ్, రాచన్న, బలవంత్రెడ్డి, వెంకట్ తదితరులున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్రమంత్రి ● సతీసమేతంగా హాజరైన కిషన్రెడ్డి ● స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్రెడ్డి, నిరంజన్, భిక్షపతి, పాండు, రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు యాదీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్ సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్ టైక్స్టైల్స్, శంషాబాద్ శ్రీకృష్ణ డ్రగ్స్తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పశువుల బీమా.. రైతుకేది ధీమా!
దౌల్తాబాద్: రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టామని ప్రభుత్వం ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పథకాల అమలుతో పలువురు రైతులు లబ్ధి పొందుతున్నారు. కానీ కొన్నేళ్లుగా పాత పథకాలు మాత్రం నిర్వీర్యం అవుతున్నాయి. అందులో భాగంగా గత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలపై సబ్సిడీపై ఎత్తివేయడంతో పాటు పాడి పశువులకు బీమా పథకం నిలిపివేసింది. దీంతో పాడి రైతులు గొర్లు, మేకల పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీమా నిలిపివేతతో మూగజీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా కష్టజీవులకు భారంగా మారింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది గతంలో పశువుల బీమా పథకంలో భాగంగా ఇన్యూరెన్స్ ప్రీమియం డబ్బులను సగం రైతులు, మరో సగం ప్రభుత్వం చెల్లించేది. దీంతో రైతులకు కొంత ఊరట ఉండేది. గేదెలు, ఆవులకు మూడేళ్లకు సరిపడా ఇన్యూరెన్స్ ప్రీమియం రూ.4వేలు ఉండగా ప్రభుత్వం రూ.రెండు వేలు చెల్లించేది. ఈ మూడేళ్ల కాలంలో పాడిరైతుకు చెందిన పశువులు ప్రమాదవశాత్తు మృతి చెందితే వాటి రకాన్ని బట్టి రూ.40వేల నుంచి రూ.8వేల వరకు ఇన్యూరెన్స్ నగదు వచ్చేది. ప్రస్తుతం రైతులు ఈ అవకాశాన్ని పొందలేక తీవ్రంగా నష్టపోతున్నారు. దాదాపు మూడు వేల కుటుంబాల పశు పోషణ, గొర్ల, మేకల పెంపకందారులు బీమా నగదు నోచుకోక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటిలాగే కొనసాగించాలి గత ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన గొల్ల, కురుమల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. పథకంలో భాగంగా గొర్లకు ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. కానీ ప్రభుత్వం ఒక ఏడాదికి సంబంధించిన ప్రీమియం మాత్రమే చెల్లించింది. గడువు ముగిసిన తర్వాత గొర్లు చనిపోతే బీమా వర్తించని కారణంగా పెంపకందార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన గొర్రెలతో పాటు గేదెలు, ఎద్దులు, ఆవులకు సైతం ఎప్పటిలాగే 50శాతం నిధులను కెటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై దౌల్తాబాద్ పశువైద్య సహాయకుడు సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా.. పశువులకు సబ్సిడీ లేదు. ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏడేళ్లుగా నిలిచిన ఇన్యూరెన్స్ పథకం నష్టపోతున్న పాడిరైతులు పట్టించుకోని అధికార యంత్రాంగం -
ఎన్నికలకు సై
నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు సమాయత్తమైన అభ్యర్థులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహుర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎ ను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు 3నెలలలోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోను అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ●రిజస్టర్/గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల నిబంధనలు పాటించాలని.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు. -
జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ
తాండూరు టౌన్: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు ఫైర్సేఫ్టీ ఆఫీసర్ నాగార్జున అన్నారు. అగ్నిప్రమాద నివారణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం, షార్ట్సర్క్యూట్, సిలిండర్ పేలడం వంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులను ఎలా కాపాడాలో ప్రదర్శన ఇచ్చారు. ఎఫ్ఎస్ఓ మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని, తాగిపడేసిన బీడీ, సిగరెట్, వంటగదిలో ఆఫ్ చేయని గ్యాస్ సిలిండర్ తదితర వాటి వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ కార్యాలయానికి సమాచారం అందజేయాలన్నారు. ఫైర్ సిబ్బంది, ఆస్పత్రి అధికారులు పాల్గొన్నారు. ఫైర్ డ్రిల్ నిర్వహించాలి అనంతగిరి: అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక అధికారి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అగ్నిమాపక పరికరాలను సరిచూసుకోవడానికి, అగ్ని ప్రమాదాలు జరిగినపుడు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రతి అంతస్తులో ఫైర్ వార్డెన్ను నియమించాలన్నారు. ఆస్పత్రిలో 3నెలలకు ఒకసారి ఫైర్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ప్రమాదం సమయంలో భయాందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైర్సేఫ్టీ అధికారులునాగార్జున, వెంకటరమణారెడ్డి ఆస్పత్రుల్లో మాక్డ్రిల్ -
మూడేళ్లయినా ముహూర్తం కుదరట్లే..!
కూలిన కల్వర్టులు ● తరచూ ప్రమాదాలు మండిపడుతున్న వాహనదారులు ● పట్టించుకోని అధికారులుకూలిన కల్వర్టులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. అటుగా వెళ్లే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. మూడేళ్లుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంట్వారం: మండల పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారాయి. దీనికితోడు అక్కడక్కడా కల్వర్టులు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆ మార్గం మీదుగా ప్రయాణమంటేనే జంకుతున్నారు. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంట్వారం, కోట్పల్లి మండలాల్లోని రొంపల్లి, నూరుల్లాపూర్, ఎన్కేపల్లి, కోట్పల్లి–తాండూరు మార్గంలోని కల్వర్టులు కూలి మూడేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ కొత్తగా నిర్మించడం లేదు. అసలే గుంతలు పడిన రోడ్లు దీనికి తోడుగా కల్వర్టులు కూలిపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్కేపల్లి రోడ్డులో మలుపు వద్దనే కల్వర్టు పై పెద్ద గుంత ఏర్పడింది. కొత్తగా ఆ రోడ్డు మీదుగా ప్రయాణం సాగించేవారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా గుంతలో పడాల్సిందే. ఇప్పటికే ఇక్కడ పలువురు గాయపడ్డారు. ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళ అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. కూలిన కల్వర్టుల వద్ద లోడింగ్ లారీలు బస్సులు దిగబడే ప్రమాదం ఉంది. ఆర్అండ్బీ శాఖ తరపున కనీసం హెచ్చరిక బోర్డులు సైతం పెట్టడం లేదు. దీంతో వాహనదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టాలి కూలిన కల్వర్టుల దగ్గర తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రొంపల్లి, నూరుల్లాపూర్, ఎన్కేపల్లి తదితర మార్గాల్లో కల్వర్టులు కూలి మూడేళ్లు గడిచాయి. అయినా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్య తీవ్రత ఉన్నప్పటికీ కనీస మరమ్మతులు చేపట్టడం లేదు. ఇప్పటికై నా పాలకులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. – నర్సింలు, రొంపల్లిచర్యలు తీసుకుంటాం కూలిన కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. నూరుల్లాపూర్ సమీపంలో కల్వర్టు నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఎన్కేపల్లి, రొంపల్లి, కోట్పల్లి–తాండూరు మార్గంలోని కల్వర్టులకు ప్రతిపాదనలు పంపిస్తాం. నిధులు విడుదలయిన వెంటనే పనులు చేపడతాం. – శ్రీనివాస్, డీఈ -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్కొడంగల్: మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యా లయంలో సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు 352 ఈవీఎం సెట్లు, 394 వీవీ ప్యాడ్లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం ఇవి కొడంగల్కు చేరినట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో 29 మంది సెక్టోరియిల్ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. ఎన్నికల అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ విజయ్కుమార్, డీటీ సురేష్ పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూం పరిశీలన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ మంగళవారం పరిశీలించారు. అక్కడి భద్రతా సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు అవసరమైన ఎన్నికల సామగ్రి వచ్చిందని తెలిపారు. హస్తం గూటికి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ తుర్కయంజాల్: డీసీసీబీ చైర్మన్ సత్తయ్య మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన తాండురు ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డితో కలిసి తుర్కయంజాల్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తరువాత తొర్రూర్లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనంతరం వారితో వెళ్లి సీఎంను కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం సాధ్యం అవుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి పంపించారు. స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా సిబ్బందితో మాట్లాడుతున్న లింగ్యానాయక్ -
ప్రమాదాల ‘ఘాటు’
● గుంతలమయంగా అనంతగిరి గుట్ట రోడ్డు ● మలుపుల్లో పట్టు తప్పుతున్న వాహనాలు ● ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు ఘాట్ రోడ్డులో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మలుపులు అధికంగా ఉన్న రహదారిలో గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. ధారూరు: జిల్లాలో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న అనంతగిరి గుట్టల వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. అసలే మలుపులున్న ఈ రహదారిలో భారీ గుంతలు ఏర్పడి వాహనాలు పట్టుతప్పుతున్నాయి. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏ కాస్తా ఏమరుపాటుగా వాహనం నడిపినా పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పదేళ్లలో వంద మీటర్ల మరమ్మతు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటి ఘాట్లో వికారాబాద్ పరిధి వరకు కేవలం 100 మీటర్ల వరకు కొత్తగా రోడ్డు వేసి మమ అనిపించారు. ధారూరు మండల పరిధిలోని ఆర్ అండ్ బీ రోడ్డు ప్రారంభం నుంచి వదిలివేశారు. ఈ రోడ్డులో తరు చూ జిల్లా స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయాణం సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్న వాహనాలు గుంతల్లోంచి వెళ్లడంతో వాహనాలు లోయలోకి పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు క్షతగాత్రులుగా మారడం పరిపాటయింది. ఇటీవల ఆర్టీసీ బస్సులకు జరిగిన ప్రమాదాల్లోనూ ఇద్దరు ప్రయాణికులు విగతజీవులయ్యారు. గుంతలకు మరమ్మతులు చేయించాల్సిన ఆర్అండ్బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రిళ్లు ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు–హైదరాబాద్ మార్గంలోని అనంతగిరి కొండల్లోని ఘాట్ రోడ్డుకు దశాబ్ధాల నుంచి మరమ్మతుకు నోచుకోలేదని వివచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అనంతగిరిగుట్ట రోడ్డునైనా బాగుచేయించి ప్రమాదాలను అరికట్టాలని వాహనదారులు, పర్యాటకులు కోరుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు అనంతగిరిగుట్టలోని 9వ కిలోమీటర్ నుంచి ధారూరు వరకు ఉన్న ధారూరు ఆర్ అండ్ బీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. అనంతగిరిగుట్టకు, కోట్పల్లి ప్రాజెక్టు వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైడ్బర్మ్లు సైతం ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
పరిగి: రైతులు దళారులను నమ్మి మోసపోరాదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం మంచి మద్దతు ధర ఇస్తోందన్నారు. క్వింటాలు ఏ గ్రేడ్ వరికి రూ. 2,203, బీ గ్రేడ్కు రూ. 2,183 ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. తూకం మిషన్లు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమ శాతం కొలిచే మీటర్లు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని మినీ గ్రౌండ్లో గల ఈవీఎం, వీవీ ప్యాట్స్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ రాజేశ్వర్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి గోపాల్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య రావొద్దు వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని నస్కల్ గ్రామంలో తాగునీటి సరఫరాపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి నీటి సరఫరా చేస్తున్న బావిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని చేతిపంపులు, బోరు బావులకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రజలు నీటిని వృథా చేయరాదన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు. పెండింగ్ దరఖాస్తులు పూర్తిచేయండి ఓటరు నమోదులో పెండింగ్ దరఖాస్తులన్నింటినీ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్సభ ఎన్నికలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఏఆర్ఓల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాహుల్శర్మ, లింగ్యా నాయక్, ఆర్డీఓలు వాసుచంద్ర, శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి -
సేవలన్నీ ప్రైవేట్కే !
తాండూరు: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు విధుల్లో ఉండాలి.. మధ్యాహ్నం 2గంటల వరకు ఓపీ నిర్వహించాలి. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ క్లినిక్లలో విధులు నిర్వహించరాదు.. కానీ ఈ నిబంధనలు తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో అమలు కావడం లేదు. ఇక్కడ పని చేసే వైద్యులు ఉదయం ఆస్పత్రికి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి 11గంటల వరకు ప్రైవేటు క్లినిక్కు వెళ్లిపోతున్నారు. ఒకరిద్దరు కాదు సూపరింటెండెంట్ మొదలుకొని సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్ల వరకు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తాండూరులో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తోపాటు అనుసంధానంగా మాతాశిశు ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ చిన్న జబ్బు చేసినా ఇక్కడికే వస్తారు. కానీ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పేదలకు సర్కారు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యులు ఉదయం 11 గంటలకే వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు తీసుకునే వైద్యులు ప్రైవేటు క్లినిక్లలో పని చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వైద్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సొంతగా ప్రైవేట్ క్లినిక్లు.. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మంది వైద్యాధికారులు విధులు నిర్వహించాల్సి ఉండగా 27 మందే ఉన్నారు. 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాతాశిశు ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ద్వారా వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే మెజారిటీ వైద్యులు సొంతంగా ప్రైవేట్ క్లినిక్లు ఏర్పాటు చేసుకొని వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దాదాపు 12 మంది వైద్యులు స్థానికంగానే ప్రైవేటు క్లినిక్లు నడుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులను వారివారి క్లినిక్లకు రావాలని వైద్యులు సూచించడం గమనార్హం. చాలా మంది రోగులు విధిలేక ప్రైవేట్ క్లినిక్లకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తగ్గుతున్న రోగులు గతంలో జిల్లా ఆస్పత్రికి నిత్యం 1500 మంది వరకు రోగులు వైద్యం కోసం వచ్చేవారు. ఇక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సగం మంది కూడా రావడం లేదు. ఉదయం 11 గంటల తరువాత ఓపీలో ఎవరూ ఉండకపోవడంతో ఆ సమయంలో వచ్చే వారు వైద్యం అందక ప్రైవేటు క్లినిక్లకు వెళుతున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని ఇటు ప్రజలు, అటు రోగులు కోరుతున్నారు. పేరుకే ప్రభుత్వ వైద్యులు.. విధులు మాత్రం ప్రైవేట్ క్లినిక్లలో.. పైస్థాయి నుంచి కింది స్థాయివైద్యుల వరకు ఇదే పరిస్థితి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా విధులకు ఇబ్బంది పడుతున్న రోగులు పట్టించుకోని పాలకులు విచారణ జరిపిస్తాం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్యాధికారులు విధుల్లో ఉండాలి. ఆస్పత్రి వేళల్లో బయట క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యుల వివరాలు సేకరిస్తాం. విచారణలో వాస్తవమని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించడమే వైద్యుల కర్తవ్యం. – డాక్టర్ ప్రదీప్, డీసీహెచ్ఎస్ -
కూలీలందరికీ పని కల్పించండి
కొందుర్గు: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలందరికీ పని కల్పించాలని డీఆర్డీఓ శ్రీలత సూచించారు. మండలంలోని పర్వతాపూర్, గంగన్నగూడ గ్రామాల్లో మంగళవా రం ఆమె పర్యటించి ఉపాధి పనులతోపాటు నర్సరీలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీల తో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు ఉదయం వేళల్లోనే పనులకు వెళ్లాలని సూచించారు. గతంలో రోజుకు రూ.272 చెల్లించేవారని, ప్రస్తుతం ప్రభుత్వం రూ.300కు కూలీ పెంచిందన్నారు. కొల తల ప్రకారం పనులు చేయాలని సూచించారు. న ర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలని, మొ క్కలను సకాలంలో మల్చింగ్ చేయాలని సూచించారు. అనంతరం కొందుర్గు మండలపరిషత్ కా ర్యాలయంలో గ్రామ ప్రత్యేకారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ కూలీలు సేద తీరడానికి పని ప్రదేశంలో టెంట్ ఏర్పాటు చేయాలన్నా రు. తాగునీరు, ప్రథమ చికిత్స కిట్టు అందుబాటులో ఉంచాలన్నారు. మస్టర్లో పేర్లు నమోదుచేసి న కూలీలే పనులు చేయాలని సూచించారు. -
కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యం
● అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్పల్లి: హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, మోదీ మళ్లీ ప్రధాని అయితే పరిశ్రమలన్నీ ప్రైవేటు పరం అవుతాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోపించారు. మంగళవారం మర్పల్లిలోని ఎంసీఎం ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. దేశం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి విజయం సాధించామో అదే ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు నేటి వరకు ఇవ్వలేదన్నారు. కుల రాజకీయాలు చేయడంలో మోదీ దిట్ట అని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని మండిపడ్డారు. చేవెళ్ల అభివృద్ధికి కృషి: రంజిత్రెడ్డి తనను మరోసారి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి రంజిత్రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలను సమర్థ వంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తమపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే దేనికై నా సిద్ధమని సవాల్ విసిరారు. ఇకపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ –2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రవీందర్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ కొండల్రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులు రాములు యాదవ్, సుభాష్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేష్, వైస్ చైర్మన్ రామేశ్వర్, సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్రెడ్డి, వైస్ చైర్మన్ ఫసియొద్దీన్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
కడ్తాల్: మానవ అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సీడీపీఓ రోజా, ప్రజ్వల సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ బలరాం కృష్ణ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి, మహిళా శిశు సంక్షేమశాఖ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రెండు రోజులుగా అంగన్వాడీ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమం మంగళవారం ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ రోజా మాట్లాడుతూ.. నేటి సమాజంలో మానవ అక్రమ రవాణా కొత్త పద్ధతుల ద్వారా సైబర్ ట్రాఫికింగ్తో జరుగుతుందన్నారు. మొబైల్లో ఆన్లైన్ వాడుతున్న ఎవరైనా దీనికి గురయ్యే అవకాశం ఉందన్నారు. సమాజంలో ప్రధానంగా యువతతో పాటు, ప్రముఖులు కూడా ఇంటర్నెట్, మొబైల్ ద్వారా సైబర్ ట్రాఫికింగ్ బారిన పడుతున్నారన్నారు. యువతులు సెల్ఫోన్లో వచ్చే రకరకాల యాప్స్తో లైంగిక వ్యాపారానికి గురికావడం జరుగుతుందని, ఫొటోస్ మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో అంగన్వాడీలు ప్రత్యేక కృషి చేయాలన్నారు. మహిళలు, పిల్లలకు రక్షణ కవచంలా మారాలని సూచించారు. అనంతరం ప్రజ్వల సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ బలరాం కృష్ణ మాట్లాడుతూ.. ప్రజ్వల సంస్థ గత 28 ఏళ్లుగా లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతుందని, ఇప్పటి వరకు 28,500 మంది మహిళలను కాపాడామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పద్మశ్రీ డాక్టర్ సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు శబరి, సరళ, ప్రజ్వల సిబ్బంది సురేశ్, అనిల్, అంబర్సింగ్, మిఽథాలీరాజ్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ రోజా -
దారి తప్పిన ధరణి స్పెషల్ డ్రైవ్
యాచారం: పెండింగ్ భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ దారి తప్పింది. ఇందులో ఏళ్లుగా మోక్షానికి నోచుకోని భూ సమస్యలు ఇక సత్వరమే పరిష్కారామవుతాయని ఎంతో ఆశపడిన అన్నదాతల ఆశ లు నీరుగారిపోయాయి. దీంతో తమ భూ సమస్య లు పరిష్కరించాలని రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన వెంటనే మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు పెండింగ్ భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి స్పెషల్ డ్రైవ్ పెట్టింది. యాచారం మండలంలోని 24 గ్రామాల్లో వివిధ రకాల భూ సమస్యలు 2,550 ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కానీ వాటిని పరిష్కరించేందుకుగాను తహసీల్దార్కు లాగిన్ ఇవ్వకపోవడం రైతులకు పెద్ద శాపంగా మారింది. కొన్నింటికే లాగిన్లు మండలంలోని మొత్తం భూ సమస్యలు 2,550 కాగా ఖాతా మర్జింగ్–9, జీఎల్ఎం–84, జీపీఏ–4 మ్యాడుళ్లలో కేవలం 97 భూ సమస్యలే ఉన్నాయి. వీటికి మాత్రమే లాగిన్లు చేయడానికి తహసీల్దార్కు అనుమతులు ఉన్నాయి. మార్చి 1 నుంచి నేటి వర కు తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు కేవలం 97 రకాల భూ సమస్యలే వెళ్లా యి. అవి కూడా పరిష్కారామయ్యాయా.. లేదా అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. వీటి లో అత్యధికంగా 1,557 టీఎం–33 భూ సమస్యలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి పరిష్కారం పట్ల రైతులు రెవెన్యూ అధికారులను కలిస్తే ఎన్నికల కోడ్ ఉన్నందు వల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని దాటవేస్తున్నారు. సమావేశాలు నిర్వహించినా.. భూ సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడం కోసం లీఫ్స్ సంస్థ(లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మార్స్ సొసైటీ) అధ్యక్షుడు డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో యాచారం మండలాన్ని పైలెట్ కింద తీసుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో లీప్స్ సంస్థ ప్రతినిధుల బృందం భూ న్యాయ శిబిరాలు నిర్వహించి 2,075 భూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని లీఫ్స్ సంస్థ ప్రతినిధుల బృందం నివేదికను తహసీల్దార్ అయ్యప్పకు అందజేసింది. ప్రభుత్వం నియమించిన ధరణి కమిటీ సభ్యులైన ముదిరెడ్డి కోదండరెడ్డి, సునీల్కుమార్, లచ్చిరెడ్డిలు పలుమార్లు మండలాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి, రెవెన్యూ అధికారులతో కూడా సమావేశమైనారు. కానీ పరష్కారం మాత్రం నేటికీ కాలేదు. పెండింగ్లో భూ సమస్యలు యాచారంలో 2,550 భూ పంచాయితీలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు -
అడవి నుంచి ఇసుక తరలింపు
ధారూరు: అడవిలోంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన ధారూరు ఫారెస్ట్ రేంజ్ రాస్నం సెక్షన్ పరిధిలోని సంగాయిపల్లి తండా సమీప అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మొయినుద్దీన్ తెలిపిన ప్రకారం.. ఇసుక తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బీట్ ఆఫీసర్ ఆనంద్, ఫారెస్ట్ బేస్ క్యాంపు సిబ్బంది పెంటయ్య, ఎల్లప్ప బృందంతో సంగాయపల్లి తండాకు చేరుకున్నామన్నారు. తండాకు చెందిన మిట్టునాయక్ ఇసుక తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని ధారూరు ఠాణాకు తరలించామన్నారు. తరచూ ఇసుక అక్రమంగా తరలిస్తున్న మిట్టునాయక్పై 2019లో అటవీ జంతుల వేటలో, ఈ ఏడాది చెట్లను అక్రమంగా నరికిన కేసులో ప్రధాన నిందితుడని ఇప్పటి వరకు చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఎఫ్ఎస్ఓ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. ట్రాక్టర్ను సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు -
ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన ముద్దెంగూడ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. అర్ధరాత్రి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తలపై టోపీలు ధరించి చేతిలో ఖట్టర్ పట్టుకొని మొదటగా సీసీ కెమెరా వైర్లను తొలగించారు. సీసీ పుటేజ్ పరిశీలించగా ఈ దొంగతనానికి ఇద్దరు వచ్చినట్లు గుర్తించారు. కింద అంతస్తుకు తాళం వేసి పైన అంతస్తులో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు. దుండగులు యజమానులు నిద్రిస్తున్న తలుపునకు బయటి నుంచి గడియ పెట్టారు. లోపలికి వెళ్లి బీరువా తాళం సైతం పగుల గొట్టి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా చేశారు. అందులో ఉన్న రెండు తులాల వెండి వస్తువులను అపహరించారు. మంగళవారం ఉదయం ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి క్లూస్టీం బృందం చేరుకొని ఆధారాల సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు. రెండు తులాల వెండి వస్తువుల అపహరణ
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement