యాచారం: పెండింగ్ భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ దారి తప్పింది. ఇందులో ఏళ్లుగా మోక్షానికి నోచుకోని భూ సమస్యలు ఇక సత్వరమే పరిష్కారామవుతాయని ఎంతో ఆశపడిన అన్నదాతల ఆశ లు నీరుగారిపోయాయి. దీంతో తమ భూ సమస్య లు పరిష్కరించాలని రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన వెంటనే మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు పెండింగ్ భూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి స్పెషల్ డ్రైవ్ పెట్టింది. యాచారం మండలంలోని 24 గ్రామాల్లో వివిధ రకాల భూ సమస్యలు 2,550 ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కానీ వాటిని పరిష్కరించేందుకుగాను తహసీల్దార్కు లాగిన్ ఇవ్వకపోవడం రైతులకు పెద్ద శాపంగా మారింది.
కొన్నింటికే లాగిన్లు
మండలంలోని మొత్తం భూ సమస్యలు 2,550 కాగా ఖాతా మర్జింగ్–9, జీఎల్ఎం–84, జీపీఏ–4 మ్యాడుళ్లలో కేవలం 97 భూ సమస్యలే ఉన్నాయి. వీటికి మాత్రమే లాగిన్లు చేయడానికి తహసీల్దార్కు అనుమతులు ఉన్నాయి. మార్చి 1 నుంచి నేటి వర కు తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు కేవలం 97 రకాల భూ సమస్యలే వెళ్లా యి. అవి కూడా పరిష్కారామయ్యాయా.. లేదా అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. వీటి లో అత్యధికంగా 1,557 టీఎం–33 భూ సమస్యలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి పరిష్కారం పట్ల రైతులు రెవెన్యూ అధికారులను కలిస్తే ఎన్నికల కోడ్ ఉన్నందు వల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని దాటవేస్తున్నారు.
సమావేశాలు నిర్వహించినా..
భూ సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడం కోసం లీఫ్స్ సంస్థ(లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మార్స్ సొసైటీ) అధ్యక్షుడు డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో యాచారం మండలాన్ని పైలెట్ కింద తీసుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో లీప్స్ సంస్థ ప్రతినిధుల బృందం భూ న్యాయ శిబిరాలు నిర్వహించి 2,075 భూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని లీఫ్స్ సంస్థ ప్రతినిధుల బృందం నివేదికను తహసీల్దార్ అయ్యప్పకు అందజేసింది. ప్రభుత్వం నియమించిన ధరణి కమిటీ సభ్యులైన ముదిరెడ్డి కోదండరెడ్డి, సునీల్కుమార్, లచ్చిరెడ్డిలు పలుమార్లు మండలాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి, రెవెన్యూ అధికారులతో కూడా సమావేశమైనారు. కానీ పరష్కారం మాత్రం నేటికీ కాలేదు.
పెండింగ్లో భూ సమస్యలు
యాచారంలో 2,550 భూ పంచాయితీలు
కార్యాలయాల చుట్టూ
తిరుగుతున్న రైతులు