మొయినాబాద్: ఆరుబయట బాత్రూంకు వెళ్లిన వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం, రాఘవరెడ్డి కాలనీకి చెందిన అతిపాటి ఆదిశేషయ్య కొంత కాలంగా మండల పరిధిలోని చిన్నషాపూర్గేటు సమీపంలో ఉంటున్నాడు. అతని సోదరుడి కూతురు లావణ్య(18) పది రోజుల క్రితం ఆదిశేషయ్య ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం బాత్రూంకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా రాఘవరెడ్డి కాలనీకి చెందిన ప్రసాద్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
షాద్నగర్రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన సిద్ధార్ధ తుకారాం కడేకర్(24) కుటుంబంతో కలిసి గత కొంత కాలం క్రితం షాద్నగర్కు వలస వచ్చారు. గ్రామంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో సిద్ధార్ధ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. బుధవారం నీటి ట్యాంకులో ఆయన పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏఎస్ఐ రాంచందర్ ఘటనా స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
చేపలు పట్టే విషయంలో ఘర్షణ
యాచారం: చెరువులో చేపలు పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణచోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తక్కళ్లపల్లి–తక్కళ్లపల్లి తండా గ్రామాల మధ్యన ఉన్న చెన్నరెడ్డిచెరువులో మంగళవారం రాత్రి తండాకు చెందిన కొంత మంది చేపలు పట్టడానికి వెళ్లారు. ఇది గమనించిన తక్కళ్లపల్లి గ్రామస్తులు చేపలు పట్టే వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.