హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష

హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష


హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురై కోలుకున్న ప్రత్యూషను బుధవారం గ్లోబల్ అవేర్ ఆస్పత్రి నుంచి  వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు బీఎస్సీ నర్సింగ్ చదవాలని ఉందని, బంధువులెవరి దగ్గర ఉండటం ఇష్టం లేదని, నాన్న, పిన్నిని కఠినంగా శిక్షించాలని కోర్టును కోరతానని తెలిపింది. హాస్టల్ లో ఉండి చదువుకుంటానని ప్రత్యూష తెలిపింది.



కాగా ప్రత్యూషను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్‌కు తీసుకురావాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, మీడియా ద్వారా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది.



ప్రత్యూషను ఆమె సవతి తల్లి, కన్నతండ్రి తీవ్రంగా హింసించిన వార్తలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటోగా రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ చేపట్టింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top