ప్రమాదవశాత్తు పెంకుటిళ్లు దగ్ధం
తూప్రాన్: ప్రమాదవశాత్తు పెంకుటిళ్లు దగ్ధమైన సంఘటనలో సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిన ఘటన మనోహరాబాద్లో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ గ్రామానికి చెందిన చింతల చంద్రయ్య ఉదయం ఇంటికి తాళం వేసి సొంత పనులపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు చంద్రయ్యకు సమాచారం అందించారు. నీళ్లతో మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది.
ఇంట్లోని బట్టలు, బియ్యం, విలువైన సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది.ఈ ప్రమాదంలో సూమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అమీజ్ హమ్మద్, ఎస్ఐ వెంకటేశ్లు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేక దేవుడి వద్ద వెలిగించిన దీపం వల్ల జరిగిందా? అనే విషయంపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. బాధితుడిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు. తక్షణ సహాయం అందజేశారు. ఇదిలా ఉంటే పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్రెడ్డి బాధితుడికి 50 కిలోల బియ్యం, రూ.1000 నగదును అందజేశారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ర్యాకల నర్సింగ్రావుగౌడ్ మాట్లాడుతూ బాధితుడిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.