గవర్నర్‌ను కలసిన ముంబై టీఆర్‌ఎస్, టీజేఏసీ నేతలు


- పలు సమస్యలు పరిష్కరించాలని వినతి

- సానుకూలంగా స్పందించిన విద్యాసాగర్‌రావు


సాక్షి, ముంబై: రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును ముంబై టీ-జేఏసీ, టీఆర్‌ఎస్ ప్రతినిధులు రాజ్‌భవన్‌లో కలసి పలు అంశాలపై చర్చించారు. మహారాష్ట్ర కాంగార్ వెల్ఫేర్ బోర్డులో తెలుగు నాకా కార్మికుల రిజిస్ట్రేషన్ కావడం లేదనీ, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని టీఆర్‌ఎస్ ముంబై శాఖ అధ్యక్షుడు బి.హేమంత్ కుమార్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.



కార్మికుల రక్షణ కోసం ఐడీ కార్డులు, స్కిల్డ్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి వలస జీవులు తెచ్చుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలను గుర్తింపునిచ్చి, స్థానిక కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని హేమంత్‌కుమార్ కోరారు. వీటన్నిటిపై సానుకూలంగా స్పందించిన సీహెచ్ విద్యాసాగర్ రావు ముంబై నాకా కార్మికుల రిజిస్ట్రేషన్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.  నాకా కార్మికులకు ముంబై-భీవండీలో రక్షణ కరవైందని, వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంటీజేఏసీ వైస్ చెర్మైన్ కె.నర్సింహగౌడ్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.



ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ముంబై శాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బొల్లె, సుంక అంజయ్య మాదిగ, ఎంటీజేఏసీ చెర్మైన్ మూల్ నివాసి మాల, కన్వీనర్లు గాజుల మహేష్, కె.సురేష్ రజక్, ఎన్.లక్ష్మన్ మాదిగ, టీ.రాములు గంగపుత్ర, ఎం.శ్రీనివాస్ బెస్త, బోగ సుదర్శన్ పద్మశాలి, కొమ్ము అంజన్న, ఉప్పు భూమన్న, సిరిమల్లె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top