ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్

ప్రిక్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్


మకావు ఓపెన్ టోర్నీ



 మకావు: డిఫెండింగ్ చాంపియన్ పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ సింధు 21-19, 21-15తో హుంగ్ షి హాన్ (చైనీస్ తైపీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో కేరళ అమ్మాయి పి.సి.తులసి 12-21, 17-21తో సు యా చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ వరుసగా రెండో విజయాన్ని సాధించాడు.



రెండో రౌండ్‌లో సాయిప్రణీత్ 21-15, 21-18తో రొనాల్డ్ సుసిలో (సింగపూర్)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 21-18, 21-16తో ఆండ్రీ మార్టిన్ (ఇండోనేసియా)పై గెలిచాడు. అయితే భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ 21-17, 17-21, 20-22తో సుపన్యు అవింగ్‌సానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో సోనీ ద్వి కున్‌కురో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)తో సింధు తలపడతారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top