ఈ స్టంప్స్ చాలా రేటు గురూ!
క్రికెట్ లో బంతి స్టంప్స్ ను గిరాటెయ్యగానే మళ్లీ వాటిని తెచ్చి బ్యాట్ హేండిల్ తో కొట్టి పాతడం చూస్తుంటాం. తాజా ప్రపంచకప్ లో అలా కుదరదు. ఎందుకంటే ఇవి చాలా సున్నితమైనవి. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఎల్ ఈడీ స్టంప్స్ కు చాలా ప్రత్యేకతలున్నాయి.
ప్రస్తుత ప్రపంచకప్ తో వాడుతున్న మూడు ఎల్ఈడీ స్టంప్స్ ఖరీదు అక్షరాలా రూ. 24 లక్షల రూపాయలు. బెయిల్స్ ధర దాదాపు 50 వేల రూపాయలు. ఎల్ఈడీ స్టంప్స్ తో అంపైర్ల పని సులువైంది. బంతికి వీటికి తగిలినప్పుడు వీటిలోని లైట్లు దానంతట అవే వెలుగుతాయి. బంతి తగిలింది, లేనిది స్పష్టంగా అర్థమవుతుంది.
2013 బిగ్ బాష్ లో తొలిసారిగా ఎల్ ఈడీ స్టంప్స్ వాడారు. తర్వాత టి20 ప్రపంచకప్ లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. వీటిపై సానుకూల స్పందన రావడంతో వన్డే వరల్డ్ కప్ లోనూ వాడుతున్నారు. ఈ మొత్తం సెట్ విలువ దాదాపు రూ. 25 లక్షలు. అందుల్లే మ్యాచ్ ముగిసిన తర్వాత స్టంప్స్ ను పీకడానికి అనుమతించడం లేదని వీటి సృష్టికర్త ఎకెర్ మాన్ తెలిపారు. స్టంప్స్ తీసుకెళ్లడం కుదరదని ఆటగాళ్లకు ఐసీసీ కూడా స్పష్టం చేసింది.
తన వాణిజ్య భాగస్వామి డేవిడ్ లీజిత్ వుడ్ తో కలిసి సుమారు మూడేళ్ల పాటు కష్టపడి అతడు వీటిని తయారు చేశాడు. వీటిని చాలా జాగ్రత్తగా వాడాల్సివుంటుందని అతడు తెలిపాడు. లసిత్ మలింగ యార్కర్ కు స్టంప్స్ విరిగిపోయే ప్రమాదముందని ఎకెర్ మాన్ భయపడుతున్నాడు.