కేఎల్ రాహుల్ అనుమానమే!
గాలే: శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా మరో రెండు రోజుల్లో ఆరంభమయ్యే తొలి టెస్టుకు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్న రాహుల్.. ఆదివారం కొలంబో నుంచి బయల్దేరిన భారత జట్టుతో పాటు ఇక్కడికి చేరుకోలేదు.
అతని జ్వరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రాక్టీస్ సెషన్ ను సైతం రాహుల్ మిస్సవుతున్నాడు. దాంతో అతను బుధవారం నుంచి గాలేలో ఆరంభమయ్యే తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాదాపు మూడు నెలల తరువాత తొలి కాంపిటేటివ్ మ్యాచ్ కు సిద్ధమైన రాహుల్.. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకవేళ మొదటి టెస్టుకు రాహుల్ దూరమైతే, శిఖర్ ధావన్ తో కలిసి అభినవ్ ముకుంద్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు.