రహదారులకు రూ.100 కోట్ల నష్టం
జీహెచ్ఎంసీ ప్రాథమిక అంచనా.. 180 కిలోమీటర్ల మేర రోడ్ల ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: వాన దెబ్బకు గ్రేటర్ హైదరాబాద్లోని రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. సుమారు రూ.100 కోట్ల నష్టం ఏర్పడింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టం వివరాలను ఆదివారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి మీడియాకు వెల్లడించారు. మహానగర పరిధిలో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లు ధ్వంసమైనట్లు ఇంజనీరింగ్ అధికారులు నివేదిక సమర్పించారు.
దీంతో తక్షణమే రహదారుల మరమ్మతులు ప్రారంభించారు. రోజుకు 1500 గుంతలను పూడ్చి వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు కమిషనర్ తెలిపారు.
అక్రమ నిర్మాణాల తొలగింపు: మహానగరంలో నాలాలు, చెరువులపై చేపట్టిన అక్రమనిర్మాణాల తొలగింపు ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. అక్రమ కట్టడాల తొలగింపునకు సర్కిల్ స్థాయిలో ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఖాళీగా ఉన్న జేఎన్యూఆర్ఎం, వాంబే ఇళ్లలో కనీసం నాలుగు వేల ఇళ్లను నిరుపేదలకు కేటాయించడానికి తమకు అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు కమిషనర్లేఖలు రాశారు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని మరింత పటిష్టపరచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
టౌన్ ప్లానింగ్ విభాగంలో 268 మంది క్షేత్ర స్థాయి సిబ్బందికిగాను కేవలం 76 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిని వెంటనే టీఎస్ పీఎస్సీ ద్వారా నింపడానికి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది ఈమేరకు కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. నలభై మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్లను డిప్యూటేషన్పై జీహెచ్ఎంసీకి కేటాయించాలని పట్టణ ప్రణాళిక విభాగం డెరైక్టర్కు లేఖ రాసినట్టు కమిషనర్ వెల్లడించారు. నగరంలో అక్రణ నిర్మాణాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో వెంటనే తగు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మరోసారి కోరినట్టు ఆయన తెలిపారు.