ఢిల్లీలో కాదు.. అమరావతిలో దీక్ష చెయ్
హైకోర్టు విభజన అంశంపై కేసీఆర్కు లక్ష్మణ్ సూచన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన ఆలస్యం కావడానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె.చంద్రశేఖరరావు అసమర్థత, వైఫల్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఢిల్లీలో దీక్ష అంటూ లీక్లు ఇస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు విభజన కోసం జంతర్మంతర్ వద్ద కాకుండా అమరావతిలో దీక్ష చేయాలని సూచించారు.
అమరావతిలో హైకోర్టు కోసం స్థలం కేటాయించని చంద్రబాబును కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. హైకోర్టు విభజన జాప్యానికి, వివాదానికి, న్యాయమూర్తుల సస్పెన్షన్కు ఇద్దరు ముఖ్యమంత్రులే కారణమని అన్నారు. హైకోర్టు విభజన కోసం కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల సహాయ, సహకారాలను అందిస్తున్నదని లక్ష్మణ్ చెప్పారు. రెండు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్, కేంద్రమంత్రులతోనూ బీజేపీ మాట్లాడినా ఇంకా నిందలు వేయడం మంచిదికాదన్నారు.