జేసీజే నియామకాలకు లైన్‌క్లియర్..


♦ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలివ్వండి

♦ తెలంగాణ ప్రభుత్వానికి  హైకోర్టు ధర్మాసనం ఆదేశం

 

 సాక్షి, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి(జేసీజే)ల నియామకాలకు లైన్‌క్లియర్ అయ్యింది. 2014 నోటిఫికేషన్ ప్రకారం జరిగిన జేసీజే రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామకపు పత్రాలు అందచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవే ఆదేశాలు 2015 నోటిఫికేషన్‌కు వర్తిస్తాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.



కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరిగేంత వరకు జూనియర్ సివిల్ జడ్జీల పోస్టులను భర్తీ చేయవద్దని కోరుతూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. తర్వాత ఇదే అంశంపై మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం  తీర్పును వెలువరించింది. సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను, ఇతర వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. 2014, 2015 సంవత్సరాల్లో జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top