టీటీడీ నిధుల్ని రోడ్లకు వినియోగించవద్దు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: తిరుపతి ఎయిర్పోర్టు నుంచి కలూర్ క్రాస్ రోడ్డు వరకు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చేపట్టే రహదారి సుందరీకరణ పనులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిధులు కేటాయించాలన్న ఏపీ సర్కార్ నిర్ణయాన్ని అమలు చేయరాదని బుధవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది.
జీవో నంబర్ 699 ప్రకారం నిధుల్ని విడుదల చేయరాదని టీటీడీ కార్యనిర్వహణాధికారికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రహదారి సుందరీకరణ పనులకు టీటీడీ నిధులు రూ.10 కోట్లను కేటాయిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.