లోకేశ్ను ప్రమోట్ చేయడానికే: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ను ప్రమోట్ చేయడానికే చైతన్య యాత్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. టీడీపీ చేసేది జన చైతన్య యాత్ర కాదని ప్రజా వంచన యాత్ర అంటూ ఆయన మంగళవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రెండు సీజన్లలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వలేదని రఘువీరా వ్యాఖ్యానించారు. వరద తాకిడికి గురైన ఏడు జిల్లాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కరువు నివేదికలను కేంద్రానికి పంపించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ సర్కార్ ఎందుకు నెరవేర్చలేకపోయారో జన చైతన్య యాత్రలో ప్రజలకు వివరించాలని రఘువీరా సూచించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ఆయన నిలదీశారు. 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఎందుకు పెండింగ్లో పెట్టారో ప్రజలకు చెప్పాలని కోరారు. జనచైతన్య యాత్రలు అనకుండా టీడీపీ చైతన్య యాత్రగా పేరు మార్చుకోవాలని రఘువీరా సలహా ఇచ్చారు.